Cogress President Elections | కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ద్విముఖ పోరు సాగనున్నది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్తో పాటు జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేఎన్ త్రిపాఠి నామినేషన్ను తిరస్కరించగా.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే – శశిథరూర్ మధ్య పోటీ జరుగనున్నది.
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియలో మొత్తం 20 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో నాలుగు తిరస్కరణకు గురయ్యాయని చెప్పారు. ఖర్గే 14 సెట్లు, శశిథరూర్ ఐదు, త్రిపాఠి సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. త్రిపాఠిని ప్రతిపాదించిన వారిలో ఒకరి సంతకం సరిపోలలేదని, అలాగే మరో ప్రతిపాదించిన వ్యక్తి సంతకం రిపీట్ కావడంతో నామినేషన్ను తిరస్కరించినట్లు మిస్త్రీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష రేసులో నిలిచిన మల్లికార్జున ఖర్గే శనివారం ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. వన్ లీడర్ వన్ పోస్ట్.. అనే కాంగ్రెస్ ఉదయపూర్ తీర్మానానికి అనుగుణంగా ఆయన రాజీనామా చేశారు. శుక్రవారం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసిన ఖర్గే.. ఎన్నికల్లో ముందంజలో ఉన్నట్లు తెలుస్తున్నది. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు గాంధీ కుటుంబం ఆయనకు మద్దతు ఇస్తుండడంతో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే, అభ్యర్థులకు మద్దతు విషయంలో తటస్థంగా ఉన్నట్లు పార్టీ తెలిపింది. శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మద్దతిచ్చిన అన్ని రాష్ట్రాల సీనియర్ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన అభ్యర్థిత్వాన్ని అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, ప్రమోద్ తివారీ, పీఎల్ పునియా, పవన్ కుమార్ బన్సాల్, ముకుల్ వాస్నిక్ ప్రతిపాదించారు. జీ23 నేతలు ఆనంద్ శర్మ, మనీష్ తివారీ సైతం ఆయనకు మద్దతు తెలుపడం విశేషం.
Delighted to learn that, following scrutiny, Shri @kharge and I will be squaring off in the friendly contest for President of @incIndia. May the Party and all our colleagues benefit from this democratic process! pic.twitter.com/X9XAyy8JCB
— Shashi Tharoor (@ShashiTharoor) October 1, 2022