ఆసిఫాబాద్: రెబ్బెన మండలంలోని ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షుడు ,కాంగ్రెస్ నాయకులు పాలే వెంకటి, మనోహర్, అశోక్, రాథోడ్ బాపురావుతో పాటు పలువురు గురువారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలను, అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేస్తుండడంతో ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై పలువురు టీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉందన్నారు. గులాబీ జెండా ప్రజలకు కొండంత అండాగా నిలుస్తుందన్నారు.
ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ప్రజాసంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా ప్రజలు పార్టీకి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. రూ. 100 చెల్లించి క్రియాశీల సభ్యత్వం పొందిన కార్యకర్త అనుకొకుండా మృతి చెందితే ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు బీమా కింద అందజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు నాగయ్య,తదితరులు పాల్గొన్నారు.