మాగనూర్/కృష్ణ/మరికల్, అక్టోబర్ 23: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం నారాయణపేట జిల్లాలోకి ప్రవేశించగా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కృష్ణ మం డలం టైరోడ్డులో ఉన్న టీఆర్ఎస్ ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చించేయడం వివాదాస్పదమైంది. సీఎం కేసీఆర్ బొమ్మ కన్పించకుండా బ్యానర్లను చించేయడంతో టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి పనులు చేశారని ధ్వజమెత్తారు. కాగా, జోడో యాత్రలో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తోపులాటలో కింద పడిపోగా చేతికి దెబ్బ తగిలింది. రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరైనప్పటికీ పాదయాత్ర సందర్భంగా రాహుల్తో కనీసం కరచాలనం చేసుకునే అవకాశం కూడా దక్కలేదు.
సీనియర్ నేతలు హనుమంతరావు, గీతారెడ్డి, చిన్నారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాదయాత్రలో పూర్తిగా వెనుకే ఉండిపోయారు. రాహుల్ ప్రసంగం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒక్కరే వాహనంపైకి ఎక్కారు. మధ్యలో ఉత్తమ్కుమార్రెడ్డి వాహనంపైకి చేరుకున్నారు. యాత్ర సందర్భంగా రాహుల్ ఒక్కరే మాట్లాడి మిగిలిన వారికి అవకాశం ఇవ్వకపోవడంతో రాహుల్ గాంధీ ప్రసంగం కార్యకర్తలకు అర్థంగాక నిరాశ చెందారు. ఇదిలావుంటే కృష్ణ మండలం టైరోడ్డు చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు తెలంగాణతల్లి పేరిట సొంతంగా రూపొందించుకున్న విగ్రహాన్ని రాహుల్ ఆవిష్కరించకుండానే ముందుకు సాగారు. అలాగే మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత, మక్తల్ మాజీ ఎమ్మెల్యే దివంగత నర్సిరెడ్డి విగ్రహాన్ని కూడా హస్తం నేతలు పట్టించుకోకపోవడంతో నర్సిరెడ్డి అభిమానులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.