న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన తర్వాత మరో ఐదుగురు నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారు. గులాం మహ్మద్ సరూరీ, హజీ అబ్దుల్ రషీద్, మహ్మద్ అమీన్ భట్, గుల్జార్ అహ్మద్ వాని, చౌదరి అక్రం మహ్మద్ రాజీనామా చేశారు. తామంతా గులాం నబీ ఆజాద్కు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశామని స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్.. పార్టీకి చెందిన అన్ని పోస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అయిదు పేజీల లేఖను ఆయన రాశారు. పార్టీలో సంప్రదింపుల ప్రక్రియ లేకుండాపోయిందని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ నాశనమైనట్లు ఆయన తెలిపారు.