మహబూబాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో పార్టీలో మళ్లీ రగడ మెదలైంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సమావేశాలకు అందరు నాయకులకు సమాచారం ఇవ్వకపోవటం గొడవకు దారి తీసింది. శనివారం మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని కిరాణా వర్తక సంఘంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఏఐసీసీ కార్యదర్శి రోహిత్చౌదరి హాజరయ్యారు. సమావేశం తుది దశకు చేరుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్చందర్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ వర్గీయుల మధ్య గొడవ జరిగింది.
పార్టీ సమావేశం నిర్వహించినప్పుడు అందరికీ సమాచారం ఇవ్వకపోవడంపై ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. ఇందులో జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులకు సమాచారం అందకపోవడంతో ఈ సమావేశానికి రాలేదు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి మాట్లాడుతూ.. కార్యకర్తలందరూ సమిష్టిగా ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. అదే సమయంలో పార్టీ సమావేశం ఉన్నట్టు నాయకులకు సమాచారమే అందడం లేదని, ఇక సమష్టిగా ఎలా ముందుకు సాగుతారని, కార్యకర్తలు స్టేజీ మీద ఉన్న నాయకులతో గొడవకు దిగారు. స్టేజీ మీద ఏఐసీసీ కార్యదర్శి ముందే ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. బలరాంనాయక్ జోక్యం చేసుకుని ఆపే ప్రయత్నం చేయగా ఎవరూ వినలేదు.
స్టేజీ పైనే కొట్టుకుంటున్న నాయకులను ఆపడానికి స్టేజీ మీద ఉన్న నాయకులు శ్రమించాల్సి వచ్చింది. పార్టీ సమావేశం నిర్వహించినప్పుడు అందరికీ సమాచారం పంపించాలి . ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి స్టేజీ పైనే చురకలు అట్టించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.