హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దమ్మ తల్లి గుడి ఆవరణలో సామూహిక అత్యాచారం జరిగిందని రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రేవంత్ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు.
ఫిర్యాదు చేసిన అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతగా కాకుండా, పెద్దమ్మ తల్లి గుడి ఫౌండర్గా పోలీసులకు ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెద్దమ్మ గుడి ఆవరణలో గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్పారు. ఆ ఘటన జరిగింది పెద్దమ్మ గుడి ఆవరణలో కాదు.. ఆ టెంపుల్ వెనుకాల ఉన్న ఏదో కాలనీలో జరిగిందని పోలీసులు కూడా నిర్ధారించినట్లు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయడం మానుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు.