జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో ఉండటంతో.. ఒకవేళ ఆయన అధ్యక్షుడిగా వెళ్తే రాజస్థాన్లో ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై చర్చ జోరందుకుంది. ఈ క్రమంలో కొంత మంది సచిన్ పైలెట్ రాజస్థాన్కు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తున్నారు. దీన్ని రాజస్థాన్ మంత్రి సుభాష్ గార్గ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
రెండేండ్ల క్రితం బీజేపీతో కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసినవాడికి సీఎం పదవి ఎలా ఇస్తారని గార్గ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా కట్టుబడి ఉంటామని, కానీ సచిన్ పైలెట్ పేరు పరిగణలోకి వస్తే గతాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. పార్టీ సిద్ధాంతాలకు, ఐక్యతకు అనుగుణంగా నడుచుకునే వాళ్లకే సీఎం పదవి కట్టబెట్టాలన్నారు.
అశోక్ గెహ్లాట్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఖరారయ్యే వరకు రాజస్థాన్లో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో చర్చ కొనసాగుతూనే ఉంటుందని సుభాష్ గార్గ్ చెప్పారు. ఏదిఏమైనా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తామే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేసే ప్రయత్నం చేసినవాడికి సీఎం పదవి కట్టబెట్టాలనే ప్రచారం జరగడం బాధాకరమన్నారు.