Congress Crisis | రాజస్థాన్ కాంగ్రెస్లో మరోసారి సంక్షోభం నెలకొన్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో అధిష్ఠానం నిలిపేందుకు ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో కొత్త ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ను నియమించేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ క్రమంలో అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఒక్కసారిగా గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేయడంతో పాటు ఆదివారం రాత్రి మూకుమ్మడి రాజీనామాలకు దిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై కాంగ్రెస్ వర్గింగ్ కమిటీ సభ్యులు తీవ్రంగా పరిగణించారు.
ఈ మేరకు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గెహ్లాట్ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఆయనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పగించడం మంచిది కాదని, పార్టీ అగ్రనాయకత్వం ఆయన అభ్యర్థిత్వంపై పునరాలోచించాలని లేఖలో సీడబ్ల్యూసీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆయనకు బదులుగా మరొకరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలని సూచించారు. అయితే, తన వారసుడిగా ఎవరు సీఎం అవుతారనే దానిపై తుది నిర్ణయం తీసుకోక ముందే.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ప్రయత్నిస్తున్న గెహ్లాట్కు ఈ లేఖ ఎదురుదెబ్బలాంటిదే.
అంతకు ముందు గెహ్లాట్ శిబిరానికి చెందిన ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి జరిగిన సీఎల్పీ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. గెహ్లాట్ శిబిరం వైఖరిపై కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నది. అలాగే కొంత మంది ఎమ్మెల్యేలపై చర్యలకు సైతం ఆలోచిస్తున్నది. మరో వైపు సోనియా గాంధీ ఆదేశాల మేరకు పార్టీ పరిశీలకులు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్ రాజస్థాన్లో పరిస్థితిపై ఆరా తీశారు. ఇరువర్గాలతో సమావేశమయ్యారు.