కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కరోనా మహమ్మారి బారినపడి గురువారం కన్ను మూశారు. ముర్షిదాబాద్ జిల్లాలోని షంషేర్గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి మొహ్మద్ రెజాల్ హక్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో ఆయనను కోల్కతాలోని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమించి మరణించారు. ఇదిలా ఉండగా.. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడుతల ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే నాలుగు విడుత పోలింగ్ పూర్తి కాగా.. ఈ నెల 17న 45 అసెంబ్లీ స్థానాలకు ఐదో విడుత ఎన్నికలు జరుగనుండగా.. బుధవారంతో ప్రచారం ముగిసింది. నాలుగో దశలో కూచ్ బెహార్లో చెలరేగిన హింస నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ సెలైంట్ పీరియడ్ను 48 గంటల నుంచి 72 గంటలకు పెంచిన విషయం తెలిసిందే. ఐదో విడుత బరిలో 342 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనుండగా.. 1.13 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యం తేల్చనున్నారు. ఉత్తర 24 పరగణాలు, పూర్బా బర్ధమాన్, నాడియా, జల్పాయిగురి, డార్జిలింగ్, కాలింపాంగ్ జిల్లాల్లో పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.