భోపాల్: కాంగ్రెస్ అభ్యర్థి 14 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఓటమిని తట్టుకోలేని ఆయన గుండెపోటుతో మరణించాడు. మధ్యప్రదేశ్లోని రేవాలో ఈ సంఘటన జరిగింది. హనుమాన మండల కాంగ్రెస్ అధ్యక్షుడైన హరినారాయణ్ గుప్తా, మునిసిపల్ కౌన్సిల్ వార్డు నెం.9లో పార్టీ టికెట్పై పోటీ చేశాడు. ఆదివారం ఫలితాలు వెలువడగా స్వతంత్ర అభ్యర్థి అఖిలేష్ గుప్తా 14 ఓట్ల తేడాతో ఆయనపై విజయం సాధించాడు. దీంతో తన ఓటమి వార్తను విన్న హరినారాయణ్ గుప్తా వెంటనే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
కాగా, మధ్యప్రదేశ్లోని 413 మున్సిపాలిటీలు, 16 కార్పొరేషన్లు, 99 నగర పాలిక పరిషత్లు, 298 నగర్ పరిషత్లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. జూలై 6, 13 తేదీల్లో రెండు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం ఫలితాలు వెల్లడించారు. ఈ ఫలితాల ప్రకారం బుర్హాన్పూర్, సత్నా, ఖాండ్వా, సాగర్లలో బీజేపీ విజయం సాధించింది. అయితే సింగ్రౌలీలో సత్తా చాటి గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో తన ఖాతా తెరిచింది.