సూర్యాపేట, మే 7 (నమస్తే తెలంగాణ): దేశంలో అతి పెద్ద అవినీతి దొంగలు బీజేపీ, కాంగ్రెస్ నేతలేనని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను అస్మదీయులకు అప్పనంగా కట్టబెడుతున్నా కాంగ్రె స్ మాట్లాడటంలేదని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా సీఎం కేసీఆర్ కొత్త మాడల్ అభివృద్ధికి శ్రీకారం చుడుతారని తెలిపారు. శనివారం సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వరంగల్లో నిర్వహించిన సభ ఆ పార్టీ నేతల ఆధిపత్య సంఘర్షణ సభ తప్ప, రైతులకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు.
పార్టీని నడపలేనని పారిపోయిన రాహుల్గాంధీ, డిక్లరేషన్ విడుదలచేయడం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. దిక్కు, దిశ లేని నావలా మారిన కాంగ్రెస్తో ఎవరు పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్ర నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప రాహుల్ తెలంగాణకు కొత్తగా చెప్పిందేమీ లేదని అన్నారు. డిక్లరేషన్ తెలంగాణకు పరిమితమా? లేక కాంగ్రెస్ జాతీ య విధానమా? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్లో మద్దతు ధర లభించక అక్కడి రైతులు తెలంగాణ మిల్లులకు వచ్చి ధాన్యం అమ్ముకొని పోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ కొంగ జపాలకు తెలంగాణ ప్రజలు మోసపోరని స్పష్టంచేశారు.