బంజారాహిల్స్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి నివాసం వద్ద ఆందోళన చేసేందుకు వచ్చిన టీఆర్ఎస్వీ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు పాశవికంగా దాడికి దిగారు. రేవంత్ రెడ్డి ఇంటికి సుమారు 200 మీటర్ల దూరంలో శాంతి యుతంగా ధర్నా చేసేందుకు యత్నిస్తున్న టీఆర్ఎస్వీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో విరుచుకుపడడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ పెద్ద సంఖ్యలో మొహరించిన పోలీసులు అడ్డుకునేందుకు యత్నించినా పట్టించుకోకపోవడంతో పాటు వారిని కూడా నెట్టేస్తూ కర్రలతో కొట్టారు.
సోమవారం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కటారి స్వామియాదవ్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి జహీర్ఖాన్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్, ఎన్ఎన్.రాజు, నిమ్మలకోటి నవీన్, ఖలీమ్, లోకేష్ తదితరులతో కలిసి పలువురు కార్యకర్తలు జూబ్లీహిల్స్లోని రేవంత్రెడ్డి నివాసం వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. అప్పటికే బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరు కున్నారు. ఆందోళనకు దిగిన టీఆర్ఎస్వీ కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తుండగానే రేవంత్రెడ్డి నివాసంలో నుంచి కర్రలు చేతపట్టుకున్న కొంతమంది కార్యకర్తలు పరిగెత్తుకుంటూ వచ్చారు.
ఆందోళన నిర్వహిస్తున్న టీఆర్ఎస్వీ కార్యకర్తలపై దాడికి దిగారు. రాళ్లు విసురుతూ వెంటపడి దాడి చేశారు. అడ్డు కునేందుకు ప్రయత్నించిన పోలీసులను సైతం పక్కకు నెట్టేస్తూ దాడి చేయడంతో టీఆర్ఎస్వీ నేత కటారి స్వామియాదవ్, జహీర్ఖాన్లకు గాయాలయ్యాయి. తీవ్ర ఉద్రిక్తత నడుమ గాయపడిన టీఆర్ఎస్వీ నేతలను జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా ప్రజాస్వామ్యయుతంగా రేవంత్రెడ్డి నివాసం సమీపంలో నిరసన తెలిపేందు కు వెళ్లిన తమపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని, తమను చంపేందుకు యత్నించారంటూ టీఆర్ఎస్వీ నేతలు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.