శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో నూతన యాగశాల నిర్మాణానికి ఆలయ ఈఓ లవన్న, బదిలీ ఈఓ కేఎస్ రామారావు ఆదివారం శంకుస్థాపన చేశారు. దాత సహకారంతో ప్రస్తుతం ఉన్న యాగశాల వద్దనే రాతితో కొత్తగా నిర్మాణం చేపడుతున్నారు. యాగశాల స్థలంలో అర్చకులు, వేదపండితులు నిర్మాణ సంకల్పాన్ని పఠించారు. తర్వాత కార్యక్రమం నిర్నిఘ్నంగా జరుగాలని మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహమండపారాధన, వాస్తుమండపరాధన, వాస్తుపూజ, శంకపూజ, యంత్ర ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం ఈఓ మాట్లాడుతూ దాతల సహకారంతో రాతి యాగశాల నిర్మిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. కృష్ణశిలతో యాగశాల నిర్మాణం జరుగుతోందన్నారు. ఒకేసారి 50 జంటలు హోమాలు నిర్వహించేందుకు వీలుందన్నారు. కార్యక్రమంలో దాతలు పర్వతయ్య, శారదాదేవి, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.