ధర్మపురి, జూన్ 14: తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటు గా నిలుస్తున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండ, బుగ్గారం, మద్దునూర్ గ్రామా ల్లో పల్లె ప్రగతి, ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు నాణ్యమైన విద్యను అందించడానికే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో రూ.3,497.62 కోట్లతో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. వెల్గొండ సర్పంచ్ గాదె తిరుపతి ఆధ్వర్యంలో ఇతర పార్టీలకు చెందిన సుమారు వంద మంది టీఆర్ఎస్లో చేరగా మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు.