న్యూఢిల్లీ, అక్టోబర్ 1: న్యాయమూర్తుల ఎంపికలో వైవిధ్యం కనబర్చాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ధర్మాసనంపై ఉండే జడ్జిలు వివిధ వర్గాలకు చెందినవారైతే, వారి నుంచి విభిన్నమైన అభిప్రాయాలు వస్తాయని అన్నారు. మైనారిటీలు, వివిధ మతాలు, సంస్కృతులకు చెందినవారు న్యాయస్థానాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. శనివారం కల్చరల్ డైవర్సిటీ అండ్ ది లీగల్ ప్రొఫెషన్ అంశంపై వర్చువల్గా మాట్లాడిన ఆయన.. తాను సీజేఐగా పనిచేసినప్పుడు కోర్టు ధర్మాసనాలపై వివిధ వర్గాల వారి ప్రాతినిథ్యం ఉండేలా చేశానని తెలిపారు. అలా ఎంతో మంది మహిళా జడ్జిలను నియమించామని వెల్లడించారు. భవిష్యత్తులో భారత తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిని చూసే అవకాశం రావొచ్చని పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామక పద్ధతి కొలీజియంపై ప్రభుత్వం సహా వివిధ వర్గాల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.