ఢిల్లీ,జూలై: తిప్పతీగ వాడడం వల్ల కాలేయానికి ఎటువంటి సమస్య ఉండదని ఆయుష్ మంత్రిత్వశాఖ తేల్చి చెప్పింది. తిప్పతీగ వాడడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది అంటూ జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ హెపటాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ఆధారంగా పత్రికల్లో వచ్చిన వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తిప్పతీగ వాడడం వల్ల ముంబైలో ఆరుగురు రోగుల కాలేయాలు దెబ్బ తిన్నాయంటూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆయుష్మంత్రిత్వశాఖ ఈ వార్తలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని,తిప్పతీగ వల్ల కాలేయం దెబ్బతిన్నదనడానికి సరైన ఆధారాలు లేకుండా ప్రచురించారని పేర్కొంది.
తిప్ప తీగ లాంటి మూలికలు కాలేయం సక్రమంగా పనిచేయడంలో దోహదం చేస్తాయని గతంలో జరిగిన పరిశోధనలు వెల్లడించాయని ఆయుష్ మంత్రిత్వశాఖ గుర్తు చేసింది.కేవలం తిప్ప తీగపై మాత్రమే ఈ అంశంపై 169కి పైగా పరిశోధనలు జరిగాయని ఇవన్నీ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని ఆయుష్ శాఖ వివరించింది. టి.కార్డిఫోలియా సమర్థతపై 871కి పైగా వివరాలను పొందవచ్చని ఆయుష్ శాఖ పేర్కొంది. ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించే తిప్ప తీగపై వందలాది పరిశోధనలు జరిగాయని తెలిపింది. కాలేయం సక్రమంగా పనిచేసేలా చూసే గుణాలను తిప్ప తీగ కలిగివుందని దీనివల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తిప్పతీగ వినియోగంపై నిర్వహించిన అధ్యయనాలు సరైన పద్ధతిలో జరగలేదని ఆయుష్ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఫలితాలను కూడా క్రమపద్ధతిలో పొందుపరచలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎంతోకాలం నుంచి ఆయర్వేద వైద్య విధానంలో తిప్పతీగను వినియోగిస్తున్నారని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాలేయాన్ని తిప్పతీగ దెబ్బ తీస్తుందని జరుగుతున్న ప్రచారం సంప్రదాయ భారతీయ వైద్య విధానంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది.