తిరువనంతపురం : కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 31, ఆగస్ట్ ఒకటో తేదీల్లో రెండు రోజుల పాటు లాక్డౌన్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు శని, ఆదివారాల్లో లాక్డౌన్ను విధించింది. మంగళ, బుధవారాల్లో వరుసగా కేరళలో 20వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దేశంలో నమోదైన కేసుల్లో దాదాపు సగం కేసులు కేరళలోనే ఉన్నాయి. బుధవారం కొత్తగా 22,056 కరోనా కేసులు, 131 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,27,301కు పెరగ్గా.. ఇందులో 31,60,804 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 16,457కు చేరింది. ప్రస్తుతం 1,49,534 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.