ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముంబై, పుణె, నాగ్పూర్, ఔరంగాబాద్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా నాగ్పూర్లో 15 నుంచి 21 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించింది. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతించింది. ఔరంగాబాద్లోనూ వారాంతాల్లో పూర్తిస్థాయిలో లాక్డౌన్ను అమలు చేస్తున్నది. ముంబై, పుణెల్లో కఠిన ఆంక్షలు విధించింది.
ఔరంగాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు వారాంతాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలుచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలోని చారిత్రక ప్రాంతాలైన ఎల్లోరా గుహలు, బీబీ కా మక్బారా, దౌలతాబాద్ (దేవగిరి) కోట వంటి కట్టడాలు ఏప్రిల్ 4 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలో నిన్నటివరకు 57,755 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 5569 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
కాగా, కరోనా నిబంధనల్లో భాగంగా పుణెలో హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు, సినిమా హాళ్లు 50 శాతం కెపాసిటీతోనే నడపాలని ఆంక్షలు విధించింది. రాత్రి 10 గంటల వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో నిన్న కొత్తగా 15,817 కరోనా కేసులు నమోదయ్యాయి. 56 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,82,191కు, మరణాల సంఖ్య 52,723కు చేరింది. గత 24 గంటల్లో 11,344 మంది కరోనా రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 21,17,744కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,10,485 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముంబై నగరంలో గరిష్ఠంగా 1,646 కొత్త కేసులు నమోదయ్యాయి.