హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)లో త్వరలో కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్టు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. విధి నిర్వహణలో ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన సుమారు 1,200 మంది ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. టీఎస్ఆర్టీసీ ఏర్పాటైన తర్వాత తొలిసారి పాలకవర్గం శనివారం సమావేశమైంది. దాదాపు 300 అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి, పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా బస్భవన్లో నిర్వహించిన సమావేశంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. వారంలో కారుణ్య నియామకాలపై కచ్చితమైన నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు.
ఆర్టీసీని నష్టాల నుంచి బయటపడేసే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించామని, వాణిజ్య భవనాల ద్వారా ఆదాయం పొందే ప్రణాళికపై సమావేశంలో చర్చించామని అన్నారు. డీజిల్ సెస్, టోల్ సెస్పై ప్రజల నుంచి వ్యతిరేకత రానందున వాటిని బోర్డు అనుమతించిందని చెప్పారు. దూర ప్రాంతాలకు ఏసీ, నాన్ ఏసీ, స్లీపర్ కోచ్ బస్సులు నడపాలని తీర్మానించామని తెలిపారు. 2014-15 నుంచి 2020-21 వరకు వార్షిక అకౌంట్లకు బోర్డు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కొవిడ్ సమయంలోనూ నిరంతరాయంగా సేవలు అందించిన కార్మికులు, సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. డీజిల్ ధర పెరిగి ఆర్టీసీకి భారీ నష్టం వచ్చిందని, ఈ క్రమంలో వినూత్న మార్గాల ద్వారా సంస్థ ఆదాయం పెంచేందుకు తీసుకొంటున్న చర్యలను బోర్డు అభినందించిందని అన్నారు. బస్స్టేషన్లలో ఫార్మసీ ఔట్లెట్లు, తార్నాకలోని ఆర్టీసీ దవాఖానను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చే ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపిందని వివరించారు. దశల వారీగా జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని సమావేశంలో నిర్ణయించామని అన్నారు. 1,060 కొత్త బస్సులను కొనేందుకు టెండర్లు కూడా వేశామని పేర్కొన్నారు.