కీసర, మే 10 : రైతాంగానికి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కంపెనీల లైసెన్స్ రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి మేరిరేఖ ఆదేశించారు. కీసర మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం విత్తన కంపెనీలు, డీలర్లతో ప్రత్యేక నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విత్తనాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే వానకాలానికి సంబంధించి విత్తన సరఫరా కింద మేడ్చల్ జిల్లాను ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేశామన్నారు. విత్తనాల్లో డీలర్లు, కంపెనీల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా తమ దృష్టికి తీసుకువస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పేట్బషీరాబాద్ ఏసీపీ రామరాజు, విత్తన ధ్రువీకరణ అధికారి పృథ్వీరాజ్, సీడ్మేన్ అసొసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, మేడ్చల్ ఏడీఏ వెంకట్రాంరెడ్డి, వివిధ మండలాలకు చెందిన వ్యవసాయాధికారులు, వివిధ కంపెనీల యాజమానులు తదితరులు పాల్గొన్నారు.