నిమ్స్లో మరో అరుదైన శస్త్ర చికిత్స
సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్జికల్ గ్యాస్ట్రో విభాగంలో మరో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. నోటి క్యాన్సర్కు గురైన వ్యక్తికి రేడియోథెరపీ దుష్ప్రభావంతో అన్నవాహిక దెబ్బతిని దాదాపు మూడేండ్లుగా నోటితో ఆహారం తీసుకోకుండా కేవలం గొంతు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పైప్ ద్వారా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటున్న వ్యక్తికి ‘కొలానిక్ ఇంటర్ పొజీషన్’ అనే శస్త్రచికిత్స ద్వారా అన్నవాహికను పున:నిర్మించి కొత్తజీవితాన్ని ఇచ్చారు నిమ్స్ వైద్యులు. జగిత్యాల జిల్లాకు చెందిన నరేశ్(40)కు నోటి క్యాన్సర్ రావడంతో 2019లో నగరంలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స తీసుకున్నాడు. చికిత్సలో భాగంగా ఇచ్చిన రేడియోథెరపీ దుష్ప్రభావంతో రోగి అన్నవాహికకు రంధ్రం ఏర్పడింది. 2020లో రోగి నాలుక, దవడకూ క్యాన్సర్ విస్తరించడంతో నాలుకలో సగభాగం, ఎడమ వైపు దవడను తొలగించి, పున:నిర్మించారు. ఈ క్రమంలో శ్వాస తీసుకునే వాయునాళం, అన్నవాహిక ఒకదానితో ఒకటి కలిసిపోయింది. దీనివల్ల రోగి ఆహారం తీసుకుంటే అది ఊపిరితిత్తుల్లోకి వెళ్లి విపరీతమైన దగ్గు రావడం మొదలైంది. చేసేది లేక రోగికి అన్నవాహిక నుంచి ఒక పైప్ను గొంతు ద్వారా బయటకు వదిలారు. దాదాపు మూడేండ్ల్లుగా పైప్ ద్వారానే ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఈనెల 4న నిమ్స్ను ఆశ్రయించాడు.
10గంటలు.. రూ.10లక్షల ఖరీదైన వైద్యం
నిమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో విభాగాధిపతి డాక్టర్ ఎన్.బీరప్ప ఆధ్వర్యంలో రోగికి వైద్యపరీక్షలు, పెట్ స్కాన్ నిర్వహించారు. రోగి అన్నవాహిక పూర్తిగా దెబ్బతినడంతో పాటు వాయునాళానికి రంధ్రం పడినట్లు గుర్తించారు. ఈ మేరకు రోగికి ‘కొలానిక్ ఇంటర్ పొజిషన్’ ద్వారా అన్నవాహికను పుననిర్మించాలని నిర్ణయించారు. 10 రోజుల క్రితం రోగికి పెద్దపేగులో పావు మీటర్ పెద్దపేగును తీసి అన్నవాహికలా చేసి శస్త్రచికిత్స జరిపారు. ఈ విధంగా పుననిర్మించిన అన్నవాహిక కింది భాగాన్ని జీర్ణకోశానికి అనుసంధానం చేసి, దీనికి ఒక రక్తనాళాన్ని కలిపినట్లు తెలిపారు. అంతే కాకుండా వాయునాళానికి ఏర్పడిన రంధ్రాన్ని మూసివేసినట్లు వివరించారు. ఈ శస్త్రచికిత్సకు సుమారు 10గంటల సమయం పట్టినట్లు వివరించారు. దీనికి కనీసం రూ.10లక్షల వరకు ఖర్చవుతుందని, నిమ్స్లో ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా ఈ శస్త్రచికిత్స జరిపినట్లు డాక్టర్ బీరప్ప వివరించారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకోవడంతో మూడేండ్ల తరువాత నోటి ద్వారా అన్ని రకాల ఆహారాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు. రోగి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఈనెల 21న దవాఖాన నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు.