అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల పరిపాలనా సముదాయాల నిర్మాణాలకు స్థల ఎంపిక పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లపై సుధీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు. కొత్త జిల్లాల పాలనకు ముహూర్తం ఖరారు కావడంతో అధికారులకు పలు విషయాలపై ఆయన దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కొత్త జిల్లాలో కనీసం 15 ఎకరాల స్థలం ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టరేట్ సహా అన్ని కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండాలని ఆదేశించారు. భవనాల కోసం మంచి డిజైన్లను ఎంపిక చేసుకోవాలని అద్దె భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత కల్పించాలని పేర్కొన్నారు.
కొత్త సంవత్సరమైన ఉగాది రోజు నుంచి కొత్త జిల్లాల పాలన అమలులోకి వస్తుందని అందరూ భావించినప్పటికీ దానిని మరో రెండు రోజుల పాటు వాయిదా వేసి ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లా అవతరణ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కొత్త జిల్లాలను ఉదయం 9 .05 నుంచి 9.45 గంటల మధ్య ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.