శ్రీశైలం : పకడ్బందీ ప్రణాళికతో మనస్ఫూర్తిగా, భక్తిభావంతో విధులు నిర్వర్తించి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోటేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా కర్నూలు కలెక్టర్ ఏర్పాట్లపై దేవస్థానం కార్యాలయ కమాండ్ కంట్రోల్ రూంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు ప్రశాంత వాతావరణంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా లోపాలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. సాధారణ భక్తులతో పాటు, దీక్షాపరులు, కాలినడకన వచ్చే భక్తులకు సాఫీగా దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.
గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ కారణంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరుకాలేదని, ఈ ఏడాది లక్షల సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నదన్నారు. ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ప్రధానంగా క్యూలైన్లు, లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం, తాగునీరు, శానిటైజేషన్, పార్కింగ్, ట్రాఫిక్పై దృష్టి పెట్టాలని, పాతాళగంగ వద్ద గత ఈతగాళ్లను నియమించాలని సూచించారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు వసతి కల్పించాలని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, క్షేత్రానికి వచ్చి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచాలన్నారు.
శివరాత్రి సందర్భంగా మార్చి 1న మహన్యాస రుద్రాభిషేకం, లింగోద్భవం, రాత్రి పాగాలంకరణ, కల్యాణోత్సవం, రథోత్సవం, తెప్పోత్సవంతో పాటు వాహన సేవలను ఆలయ సంప్రదాయం ప్రకారం నిర్వహించాలని ఈవోను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు వేయాలని, మంచినీటి వసతి కల్పించాలన్నారు. అటవీ ప్రాంతం నుంచి కాలినడకన వచ్చే భక్తులకు ఏదైనా సమస్యలుంటే వెంటనే సమాచారం అందించేందుకు అవసరమైనన్ని వైర్లెస్ సెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని పోలీస్శాఖకు సూచించారు.
అన్నదానం చేసే భక్తుల వివరాలను సేకరించి, ఆయా రోజుల్లో ఎంత మందికి అన్నదానం చేస్తున్నారనే సంబంధిత వివరాలను సేకరించాలని ఈవోను ఆదేశించారు. కేటాయించిన చోట్లనే వాహనాలు పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. దేవస్థానం పరిసరాల్లో సీసీ కెమెరాటు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఆలయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్సవాల రోజుల్లో క్షేత్రం పరిసరాల్లో అక్రమ మద్యం విక్రయాలను నిషేధించాలని కలెక్టర్ ఆదేశించారు. కేటాయించిన విధుల్లో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి మాట్లాడుతూ గతేడాది కంటే ఈ సారి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేవస్థానం ఈవో లవన్న మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్కు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశామని, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలు కల్పిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు రామసుందర్రెడ్డి, శ్రీనివాసులు, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆజాద్, కర్నూలు, ప్రకాశం, మహబూబ్ నగర్, అచ్చంపేట, నాగర్ కర్నూల్ జిల్లాల అధికారులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.