కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నల్లగొండ, జూన్ 9 : ఈ నెల 12న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగే పరీక్షకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పేపర్-1కు 96 కేంద్రాల్లో 22,936 మంది, పేపర్-2కు 87 కేంద్రాల్లో 20, 543 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో పోలీస్ బందోబస్త్తోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించవద్దని సూచించారు. పేపర్-1, 2కు 96 మంది ప్రధాన పర్యవేక్షకులు, డిపార్ట్మెంట్ అధికారులు, 36 మంది రూట్ అధికారులు, 16 మంది రిపోర్టింగ్ అధికారులు, 287 మంది సూపరింటెండెంట్లు, 96 మంది క్లర్కులు, 960 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నట్లు వివరించారు. అన్ని కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలని సూచించారు. సమావేశంలో ఏసీ చంద్రశేఖర్, డీఆర్ఓ జగదీశ్వర్రెడ్డి, ఆర్డీఓలు రోహిత్సింగ్, గోపీరాం, డీఈఓ భిక్షపతి పాల్గొన్నారు.