మహబూబ్నగర్
: జిల్లాలోని దేవరకద్ర పశువుల సంతలో నకిలీ రసీదు బుక్కులతో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ఈ విషయంపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. దేవరకద్ర మండల కేంద్రంలో ప్రతి బుధవారం నిర్వహించే పశువుల సంతను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
దేవరకద్ర పశువుల సంత పశువుల క్రయవిక్రయాలకు ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా ఇక్కడికి జిల్లా నుంచే కాక ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పశువుల క్రయవిక్రయాలకు కొనుగోలుదారులు, అమ్మకందారులు వస్తుంటారు. కరోనా కారణంగా పశువుల సంత టెండర్ దక్కించుకున్న గుత్తేదారు మధ్యలోనే విరమించుకున్న కారణంగా ప్రస్తుతం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలోనే పశువుల సంతలో పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే దీన్ని ఆసరా చేసుకుని బయటి వ్యక్తులు కొందరు నకిలీ రసీదు పుస్తకాలను తయారు చేయించి ప్రతి బుధ వారం పశువుల సంతలో క్రయ విక్రయదారుల నుంచి పన్ను రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు.
పక్కా సమాచారం అందుకున్న అదనపు కలెక్టర్ బుధవారం పశువుల సంత ను ఆకస్మికంగా తనిఖీ చేయడమే కాకుండ 4 నకిలీ రసీదు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడమే కాక ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా నకిలీ రసీదు బుక్కులు సృష్టించి డబ్బులు వసూలు చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై సమగ్ర విచారణ నిర్వహించి సంబంధితుల పై తగు చర్య తీసుకొనున్నట్లు ఆయన వెల్లడించారు.