హైదరాబాద్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): సీఎమ్మార్ సేకరణ, మిల్లింగ్ ఆలస్యంపై పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇందుకు కారణమైన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఉపేక్షించేది లేదని, అధికారులు, మిల్లర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎమ్మార్ సేకరణ, ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో ఎంసీఆర్హెచ్ఆర్డీలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కచ్చితమైన నిబంధనలు పాటిస్తూ గడువులోగా మిల్లింగ్ పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మిల్లింగ్లో జాప్యం జరిగితే అధికారులదే బాధ్యత అని స్పష్టం చేశారు.
త్వరలోనే అన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఈ వానకాలంలో సుమారు 1.30 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నదని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ధాన్యం తడిసిందో లెక్కలు తీయాలని, వారం రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. పీడీఎస్ బియ్యం పకదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అవసరమైతే ఇందుకోసం టాస్ఫోర్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని మంత్రి గంగుల సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పీడీఎస్ బియ్యం రీసేల్, రీసైక్లింగ్ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. సంక్షేమ గురుకులాలకు, హాస్టళ్లకు, విద్యాలయాలకు నాణ్యమైన పాత బియ్యాన్నే అందించాలని ఆదేశించారు.