హయత్నగర్ : మూడు రోజుల క్రితం భూగర్భ డ్రైనేజీలో గల్లంతైన మున్సిపల్ కార్మికుడు అంతయ్య మృతదేహం కోసం నిర్వీరామంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాహెబ్ నగర్, పద్మావతి కాలనీ నుంచి పసుమాముల వరకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న 255 మ్యాన్హోల్స్ను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని దేవిరెడ్డి సుధీర్రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం మూడు బోట్లు, నాలుగు రెస్క్యూ టీమ్లు, డ్రోన్ కెమెరాల సహాయంతో అణువణువునా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. 300 మంది మున్సిపల్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పద్మావతి రెస్క్యూ టీమ్ అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి మ్యాన్హోల్ చెకింగ్, చెరువుల పరిశీలన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. డ్రైనేజీ పైపుల్లో చిక్కుకుపోయిన మృతదేహాన్ని గుర్తించేందుకు కోయంబత్తూరు నుంచి స్పెషల్ టీమ్ను రప్పిస్తున్నామని ఆయన వెల్లడించారు.
కొంతమంది రాజకీయ నాయకులు మున్సిపల్ అధికారులు, యంత్రాంగంపై ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హితవు పలికారు. శవాల మీద రాజకీయం చేయడం మానుకోవాలని వారిని హెచ్చరించారు. మున్సిపల్ అధికారులకు సమాచారం అందించకుండా రాత్రిపూట డ్రైనేజీ పనులు నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది మరణానికి కారణమైన సదరు కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసులు పెట్టినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు జీహెచ్ఎంసీ తరఫున రూ.10 లక్షలు, కాంట్రాక్టర్ తరఫున రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. మృతిచెందిన శివ దహన సంస్కారాలకు తాను సొంతంగా రూ.50వేలు అందజేశానని తెలిపారు.
నల్గొండ జిల్లా ముష్టిపల్లికి చెందిన నల్లవెల్లి అంతయ్య(47), డిండి మండలం ప్రతాప్నగర్కు చెందిన శివ(27) చంపాపేటలోని చింతల బస్తీలో ఉంటున్నారు. ఇద్దరు బంధువులు. డ్రైనేజీ శుభ్రం చేసేందుకు కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 9గంటల సమయంలో బీఎన్రెడ్డి నగర్ డివిజన్ సాహెబ్నగర్ పద్మావతి బ్యాంకు కాలనీలో మ్యాన్హోళ్లు శుభ్రం చేయాలని సూపర్వైజర్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో మరో ఇద్దరు కార్మికులతో కలిసి ఆటోలో వీరిరువురు అక్కడికి వెళ్లారు. 11గంటల సమయంలో రెండు మ్యాన్ హోళ్ల మూతలు తొలగించారు. దీంతో శివ బకెట్కు తాడు కట్టి అందులో వేసేందుకు నిచ్చెన సహాయంతో లోపలికి దిగాడు. సగానికి పైగా దిగిన వెంటనే విషవాయువులతో పట్టుతప్పి లోపల పడిపోయాడు. గమనించిన సూపర్వైజర్ శివను కాపాడేందుకు అంతయ్యను లోనికి దింపాడు. అప్పటికే మురుగునీటిలో పడి ఉన్న శివ.. కాపాడు బావా.. అని కేకలు వేస్తూ అంతయ్య కాలు పట్టుకుని పైకి వచ్చే ప్రయత్నం చేశాడు. నిచ్చెన పట్టుతప్పిన అంతయ్య అమాంతంగా నీటి ప్రవాహంలో పడిపోయాడు. శివ కాలు నిచ్చెనకు చిక్కుకుపోవడంతో బయట ఉన్న మరో ఇద్దరు లోపలికి దిగి శివను బయటకు తీయగా అప్పటికే అతడు మృతి చెందాడు. అంతయ్య కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.