హైదరాబాద్ : సహకార రంగమే ఈ దేశానికి వెన్నెముక అని అది బలంగా ఉంటేనే మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ సహకార గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో సహకారశాఖలో డీఅర్ నుండి ఎస్సీడీఆర్ వరకు పదోన్నతులు పొందిన అధికారుల సమావేశం గురువారం నగరంలోని హాకా భవనంలో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సహకారశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సహకార శాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సహకార శాఖను బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. స్పష్టమయిన ప్రణాళికతో ముందుకుసాగుదామన్నారు. సమర్దవంతమయిన అధికారులు సహకార శాఖలో ఉన్నారన్నారు. అందరం కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అని పేర్కొన్నారు. సహకార శాఖ మీద ఉన్న దురభిప్రాయాన్ని తొలగించేందుకు కృషి చేద్దామన్నారు. ఏ విధంగా ముందుకెళ్తే సహకార శాఖ ప్రతిష్టను ఇనుమడించగలమో సూచించాల్సిందిగా కోరారు. కొన్ని రాష్ట్రాలలో సహకార రంగం బలంగా ఉంది. వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్దామన్నారు
పదోన్నతులు ఉద్యోగుల హక్కు అన్న మంత్రి ప్రభుత్వంలో మంత్రిగా పదోన్నతుల విషయంలో తన బాధ్యతను నిర్వర్తించినట్లు చెప్పారు. ఈ శాఖలో 16 ఏళ్లుగా పదోన్నతులు లభించకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని శాఖలలో పదోన్నతులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల నిర్ణయాలు, కోర్టు కేసులు పదోన్నతుల విషయంలో చిక్కుముళ్లుగా ఉన్నాయన్నారు. పదోన్నతుల కోసం నియమించిన కమిటీ విజయవంతంగా ప్రక్రియను పూర్తిచేయడాన్ని మంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమంలో సహకార గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు జగన్ మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి భీం రాజ్, సహాధ్యక్షులు నాగేశ్వర్ రావు, ఉపాధ్యక్షులు సంజీవరెడ్డి, పదోన్నతి పొందిన అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, విష్ణువర్ధనరావు, నందకిషోర్, రమాదేవి, డా. ప్రసన్న, సుజాత తదితరులు పాల్గొన్నారు.