ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి
గతంలో ఎండకాలం వచ్చిందంటే ఊర్లకు వెళ్లలేని పరిస్థితి
ఇప్పుడు గ్రామాల రూపురేఖలే మారిపోయాయి
మహిళలు పరిశ్రమలు స్థాపించాలి
మహిళా సంఘాలకు రూ.50లక్షల దాకా ప్రభుత్వ రుణాలు
సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్
సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్తో కలిసి జనగామ జిల్లాలో పర్యటన
మూడు గ్రామాల్లో పల్లె ప్రగతి పనుల పరిశీలన
ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు
బోనమెత్తి.. బతకమ్మ ఆడి.. ఉత్సాహపరిచిన ఉన్నతాధికారులు
దేవరుప్పుల/లింగాలఘనపురం/జనగామ రూరల్/జనగామ చౌరస్తా, జూన్ 23 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లె ప్రగతితో ఐదేళ్లలోనే గ్రామాల రూపురేఖలు మారిపోయాయని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పరిశ్రమలు స్థాపించాలనుకునే సంఘాలకు ప్రభుత్వం రూ.50లక్షల దాకా రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. సీఎం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ శివలింగయ్యతో కలిసి జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నేలపోగుల, నెల్లుట్ల, దేవరుప్పుల మండలం కడవెండిలో గురువారం ఆమె పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నేలపోగులకు ఉన్నతాధికారులు రాగానే ఎంపీపీ చిట్ల జయశ్రీ, సర్పంచ్ దూసరి గణపతి బోనాలు, బతకమ్మలు, ఒగ్గు కళాకారుల విన్యాసాలతో ఘనస్వాగతం పలికి పల్లెప్రకృతి వనానికి తీసుకెళ్లారు. ఊరేగింపులో స్మితా సబర్వాల్ బోనమెత్తి ఆకట్టుకున్నారు. నర్సరీని పరిశీలించి తోటమాలి శామ్యూల్ను శాలువాతో సన్మానించారు.
క్రీడా మైదానాన్ని ప్రారంభించి క్రీడల్లో బాలికలను ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులతో కలిసి సెల్ఫీ దిగారు. గ్రామ సభకు వెళ్తూ బతకమ్మ ఆడారు. వైకుంఠధామాన్ని పరిశీలించి, పాఠశాలలో మొక్కలు నాటారు. నేలపోగుల, నెల్లుట్లలో సర్పంచ్లు గణపతి, చిట్ల స్వరూపారాణి అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో స్మితా సబర్వాల్ మాట్లాడారు. గతంలో ఎండాకాలంలో అధికారులు ఊళ్లకు వెళ్లాలంటే తాగునీటి కోసం ప్రజలు నిలదీస్తారేమోనని భయపడేవారని, ఏ వీధిలో చూసినా చెత్తా చెదారంతో దుర్వాసన వచ్చేదని, ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడేవారని గుర్తుచేశారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతోందని చెప్పారు. పల్లె ప్రగతి పనుల ద్వారా ఇప్పుడు గ్రామాలు పరిశుభ్రంగా మారాయన్నారు. కొన్ని గ్రామాల్లో వైకుంఠధామాలకు నీటి సౌకర్యం లేదని తన దృష్టికి వచ్చిందని, వారంలోగా రాష్ట్రంలోని అన్ని వైకుంఠధామాలకు నీటి సౌకర్యం కల్పిస్తామన్నారు.
కడవెండి బాగుంది..
ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతితో గ్రామాలు అందంగా, ఆహ్లాదకరంగా మారాయని స్మితా సబర్వాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. దేవరుప్పుల మండలం కడవెండికి రాగానే గ్రామం చూడముచ్చటగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో గ్రామం నంబర్వన్గా నిలిచిందని అభినందించారు. గ్రామానికి వచ్చిన ఉన్నతాధికారులకు మహిళలు కోలాటాలు, బతుకమ్మలతో స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. మహిళా సంఘాలతో గ్రామంలోని రైతు వేదికలో సర్పంచ్ పోతిరెడ్డి బెత్లినా రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇక్కడ స్మితాసబర్వాల్, ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకున్నారు. తెలంగాణలో పల్లెలు పట్టణాలతో పోటీ పడుతున్నాయని గ్రామస్తులు చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో సాగు, తాగునీటి కరువు తీరిందని, చెక్డ్యాంలతో చెరువులు నిండుతున్నాయని తెలిపారు. మహిళలకు ప్రాధాన్యం పెరిగిందని, ఆర్థికంగా ఎదిగామని, సంఘటితంగా ఉన్నామని మహిళల నుంచి వచ్చిన సమాధానాలు విని ఆశ్చర్యపోయారు. గ్రామాలన్నీ కడవెండిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కడవెండి పంచాయతీ సిబ్బందిని సన్మానించారు. సర్పంచ్ పోతిరెడ్డి బెత్లినారెడ్డి, కార్యదర్శి మధుకర్, కారోబార్ బత్తిని వెంకన్న, వన సేవకుడు సుడిగెల ఎల్లయ్య, పారిశుధ్య సిబ్భంది పడమటింటి రామచంద్రు, బాసిపాక అయిలయ్య, యాదగిరి, పైండ్ల రమణ, ఉత్తెపు అయిలయ్యను అధికారులు సన్మానించారు. సీతారాంపురంలో జాతీయ రహదారి పక్కన సర్పంచ్ రెడ్డిరాజుల రమేశ్ కోరిక మేర మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ బస్వ సావిత్రి, సర్పంచ్ రమేశ్ అధికారులను సన్మానించారు.
అర్బన్పార్కులో పండ్లతోటలు అద్భుతం..
నెల్లుట్ల అర్బన్పార్క్లో పండ్లతోటలు అద్భుతంగా ఉన్నాయని స్మితా సబర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు. నెల్లుట్ల అర్బన్పార్క్ను సందర్శించి జామ, అల్లనేరేడు, దానిమ్మ, సీతాఫలం తోటలను పరిశీలించి అబ్బురపడ్డారు. ఈ సీజన్లో సీతాఫలాలు కాస్తుండడం విశేషమన్నారు. పల్లెప్రకృతి వనానల్లో పండ్ల తోటలు పెంచితే ఉభయతారకంగా ఉంటుందన్నారు.
కలెక్టరేట్ పరిశీలన
జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్ను అధికారుల బృందం పరిశీలించింది. కలెక్టరేట్కు వచ్చిన ఉన్నతాధికారులకు కలెక్టర్ శివలింగయ్య స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయాలను కలియతిరిగారు. ఇక్కడ నుంచి గ్రామాల పర్యటనకు తరలివెళ్లారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, అబ్దుల్ హమీద్, డీఆర్డీవో రాంరెడ్డి, డీపీవో రంగాచారి, పీడీ నూరొద్దీన్, ఎంపీపీలు బస్వ సావిత్రి, చిట్ల జయశ్రీ, ఎంపీడీవో రాజలింగం, మండల ప్రత్యేకాధికారి లత, తహసీల్దార్ అంజయ్య, ఎంపీడీవో సీతారాంనాయుడు, ఎంపీవో మల్లికార్జున్, ఏఈ మధు , ఏపీఎంలు శంకరయ్య, సత్యనారాయణ తదితరులున్నారు.