UP Polls : భూ కబ్జాదారులను తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అవసరమైతే బుల్డోజర్లతో కూల్చివేతలకు వెనుకాడబోమని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాంపూర్లో శనివారం జరిగిన ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నేరగాళ్ల ఆటకట్టిస్తామని, నేరాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని స్పష్టం చేశారు.
ఎవరైనా అక్రమంగా భూ ఆక్రమణలకు పాల్పడితే ఆ భూమిని తిరిగి అసలు యజమానికి ప్రభుత్వం అప్పగించేలా చర్యలు చేపడతామని చెప్పారు. అవసరమైతే బుల్డోజర్లతో అక్రమ భూకబ్జాదారుల భవంతులను కూల్చేస్తామని హెచ్చరించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో బీజేపీ, ఎస్పీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.
కాన్పూర్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పెర్ఫ్యూమ్ వ్యాపారి ఇంట భారీ నగదు పట్టుబడటం విపక్షాల నిర్వాకాన్ని బట్టబయలు చేస్తోందని ఎస్పీ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రత్యర్ధులు లక్ష్యంగా బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్ధలతో పాటు ఐటీ అధికారులను పురిగొల్పుతోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.