అమరావతి : హిందూపురం వైసీపీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ వ్యవహారంలో ఏపీ సీఎం విచారణకు ఆదేశించారని ఏపీ మంత్రి రోజా తెలిపారు. రాష్ట్రంలోని మహిళలకు ఏమైనా ఇబ్బందులు కలిగితే జగన్ సహించరని అన్నారు. తమది మహిళా పక్షపాతి ప్రభుత్వమని వివరించారు. ఎంపీ మాధవ్పై సోషల్ మీడియాలో వచ్చిన వీడియో కాల్ నిజమో, కాదో తెలుసుకోకుండా టీడీపీ నాయకులు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విచారణలో అన్ని విషయాలు బయట పడుతాయని తెలిపారు.
ఇటీవల తన కొడుకుకు కొనుగోలు చేసిన కారు విషయంలోనూ అనవసర ఆరోపణలు చేశారని అన్నారు. చిన్నచిన్న ఆర్టిస్టులు సైతం కారును కొనుగోలు చేస్తే తనలాంటి వారు కొనుగోలు చేయడం సర్వసాధారణ విషయమని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులకు ఆరోపణలు చేయడానికి ఏమి దొరకక అనవసర వాటిపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ హయాంలో నారాయణ కళాశాలలో జరిగిన ఎంతో మంది విద్యార్థినీలు ఆత్మహత్యలు జరిగితే స్పందించలేదని, ఏ ఒక్క కేసు నమోదు కాలేదని తెలిపారు.