హైదరాబాద్ : పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ, హరితహారంపై జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులతో ఈ నెల 23న ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను సానుభూతితో పరిష్కరించడంతో పాటు అడవి తరిగిపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, సమగ్ర కార్యాచరణను రూపొందించనున్నారు.
అలాగే హరితహారం ఫలితాలను అంచనా వేస్తూ మరింత విస్తృత స్థాయిలో ఫలితాలు రాబట్టేందుకు భవిష్యత్లో చేపట్టాల్సిన కార్యాచరణపై సైతం సమావేశంలో చర్చించనున్నారు. సమావేశానికి అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సంబంధిత శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, కన్జర్వేటర్లు, డీఎఫ్ఓలు, ఐటీడీఏ ప్రాజెక్టుల అధికారులు హాజరుకానున్నారు.
ఈ నెల 20, 21, 22 తేదీల్లో పోడు భూముల సమస్యపై అధ్యయనంలో భాగంగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, పీసీసీఎఫ్ శోభలతో కూడిన అధికారుల బృందం హెలికాప్టర్ ద్వారా సంబంధిత అటవీ ప్రాంతాలను సందర్శించనున్నది.