వరంగల్ : పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూనే ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
బుధవారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ హక్కుల చట్టం అమలుపై ఏర్పాటు చేసిన అఖిలపక్షం సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి , సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గిరిజన, గిరిజనేతరుల సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అటవీ సంపదతో జీవనం సాగిస్తూనే.. పోడు చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించాలని సీఎం నిర్ణయించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టారన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే..పోడు రైతుల సమస్యల పరిష్కారానికి పట్టాలిచ్చేందుకు కృషి జరుగుతుందని పేర్కొన్నారు.
అందులో భాగంగా అటవీ హక్కుల చట్టం-2006 అమలుకు సీఎం కృషిలో భాగంగా 2005 డిసెంబర్13కు ముందు ఆక్రమణలో ఉన్న అర్హులైన రైతులకు మాత్రమే పట్టాలు అందే విధంగా అన్ని పక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గిరిజనుల పేరుతో యంత్రాల ద్వారా అడవులను కొల్లగొడుతున్న వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. నిజమైన అటవీ పోడు రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని, పర్యావరణం పరిరక్షణకు అడవులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరం కృషి చేస్తామని సమావేశంలో ప్రతిజ్ఞ చేశారు.
జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, పోడు భూములపై, అడవుల సంరక్షణ పై గతంలో తీసుకున్న చర్యలపై, ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమంపై వివరించారు.
వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు తమ గ్రామం, మండలానికి సంభందించిన, ఏళ్ల తరబడి పొడు వ్యవసాయం చేస్తూ ఇతర ఆధారం లేక దీనిపైనే ఆధారపడి జీవిస్తున్న నిజమైన హక్కు దారునికి హక్కులు కల్పించి శాశ్వత పరిష్కారం చేయాలన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డా.టి.రాజయ్య, ఎంపీ లు డా.బండా ప్రకాష్, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు మండల ప్రజా ప్రతినిధులు, ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.