హైదరాబాద్ : ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎవని భాషను వాడు రాయాలె, మాట్లాడాలె’ అనే కాళోజీ మాతృభాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహను అందించారని, వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ అమ్మ భాషకు సాహితీ గౌరవాన్ని మరింతగా పెంచేందుకు తెలంగాణ సాహితీ వేత్తలు కృషిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషి చేస్తున్న కవులు రచయితలను గుర్తించి వారికి కాళోజీ పేరున పురస్కారాలను అందిస్తూ ప్రభుత్వం గౌరవించుకుంటున్నది గుర్తు చేశారు. ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అని నినదించిన కాళోజీ జీవితం అంతా తెలంగాణ భాషా సాహితీ సేవ దిశగా సాగిందన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కాళోజీ పురస్కారాన్ని.. ఈ ఏడాది ప్రముఖ కవి రచయిత పెన్నా శివరామకృష్ణ అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.