హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): వినాయకుడి దీవెనలతో సకల జన సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్ర్తాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలిగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథుడిని ఆరాధిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు.
జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి మనకు నేర్పుతుందని తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా, ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా, వినాయకుని దీవెనలతో వాటన్నింటిని అధిగమిస్తూ, సకల జన సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా, సుఖ శాంతులతో జీవించేలా, దేశ ప్రజలందరికీ ఆ ఏకదంతుని దీవెనలు అందాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.