హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణభగవానుని జన్మదినం హిందువులకు పర్వదినమన్నారు. గోకులాష్టమిగా, ఉట్ల పండుగగా ప్రజలు జరుపుకునే శ్రీ కృష్ణుని జన్మదినానికి పురాణ ఇతిహాసాల్లో ప్రత్యేకత ఉందన్నారు. భారతీయ హిందూ ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ జీవన విధానంలో శ్రీకృష్ణుని తాత్వికత అత్యంత ప్రత్యేకమైనదని, ప్రభావశీలమైందని సీఎం పేర్కొన్నారు. నేటి సాంకేతిక యుగంలో అనేక రకాల ఒత్తిళ్లకు గురవుతూ.. సమయ సందర్భానుసారంగా సరైన నిర్ణయాలను తీసుకోలేకపోతున్న నేటి యువత శ్రీకృష్ణుడి జీవన ప్రయాణాన్ని లోతుగా అవగాహన చేసుకోవాల్సి ఉందన్నారు.
మానవ సామాన్య మస్తిష్కం అర్థం చేసుకోలేని అనేక సందేహాలకు కృష్ణతత్వంలో సమాధానాలున్నాయన్నారు. నైరూప్యమానమైన శ్రీకృష్ణలీలల్లో పలు కోణాల్లో పరమార్థం దాగి ఉంటుందని సీఎం వివరించారు. ప్రజా సంక్షేమం కోసం, రాగద్వేషాలకు అతీతంగా శాంతి సౌభ్రాతృత్వభావనలను వికసించేలా గీతాచార్యులు అనుసరించిన రాజకీయ పాలనాపరమైన నిర్ణయాలు, విధానాలు, బోధనలు ప్రాతః స్మరణీయమన్నారు. కష్ట సుఖాలు, మంచి చెడులు, లాభ నష్టాలకు అతీతంగా అన్ని సందర్భాల్లోనూ, ఒకే విధమైన ప్రవర్తనను కలిగివుండే స్థితప్రజ్జతను సాధించడం శ్రీకృష్ణతత్వంలోని పరమార్థమని తెలిపారు. స్థితప్రజ్జతను సాధించడం ద్వారా మాత్రమే లక్ష్యాన్ని ఛేదించి గమ్యాన్ని ముద్దాడతామనే శ్రీకృష్ణుని కార్యాచరణ ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.