హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జిల్లాల్లో పర్యటించనున్నారు. 19న వనపర్తి జిల్లాలో, 20న జనగామ జిల్లాల పర్యటనకు వెళ్లానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు బహిరంగ సభల్లోనూ పాల్గొననున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ, మండలి సభ్యులు, జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు, కేడీసీసీబీ అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. అలాగే 18న దళితబంధుతో పాటు పలు అంశాలపై కలెక్టర్లతో భేటీకానున్నారు. ప్రగతిభవన్లో జరిగే సమావేశంలో మంత్రులు, సీఎస్ సోమేశ్కుమార్, సీనియర్ అధికారులు పాల్గొననున్నారు.
వికారాబాద్, జనగామతో పాటు త్వరలోనే పలు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటనలో ఉమామహేశ్వర లిఫ్ట్, రిజర్వాయర్కు, వంద పడకల దవాఖానకు శంకుస్థాపన చేయనున్నారు. నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్ జిల్లాల్లోని కలెక్టరేట్లను ప్రారంభించి, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జిల్లాల పర్యటనలో ఆయా జిల్లాల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు.