హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 27, 28 తేదీల్లో 26 రాష్ట్రాలకు చెందిన సుమారు వంద మంది రైతు సంఘాల నేతలు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. దేశంలో వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఉద్యమ పంథాను పార్లమెంటరీ పంథాతో సమన్వయం చేసి జమిలి పోరాటం చేస్తేనే దేశంలోని రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని కేసీఆర్తో వివిధ రాష్ర్టాల రైతు నేతలు అంగీకరించారు. దీంతో రాబోయే రోజుల్లో దేశవ్యాప్త రైతు ఉద్యమానికి అంకురార్పణ జరిగినట్లు అయ్యింది.
మొన్ననే.. 75 ఏండ్ల భారత స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నాం. డబ్భు ఐదేండ్ల స్వతంత్ర భారతంలో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. రైతులు అప్పుల్లో పుట్టి అప్పుల్లోనే చనిపోతున్నారు. దేశంలో అరగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. 1995 నుంచి నేటి దాకా.. సుమారు 4 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు జాతీయ నేరాల నమోదు నివేదిక (ఎన్సీఆర్బీ) రిపోర్టు తెలియజేసింది. ఇంకా వెలుగులోకి, లెక్కలోకి రానివి ఎన్నో. ఈ పరిస్థితుల్లో దేశంలో ప్రతిరోజు సగటున సుమారు రెండువేల మంది దినదిన గండంగా మారిన వ్యవసాయాన్ని వదిలిపెడుతున్నారు. మిగిలినవారు కూడా గత్యంతరం లేక, ఇతర మార్గాలు లేకపోవటం చేతనే వ్యవసాయంలో కొనసాగుతున్నారు.
ప్రపంచంలో భారత వ్యవసాయ రంగానికి విశిష్టత ఉన్నది. ప్రపంచంలో మూలమూలన పండే పంటలన్నీ ఒక్క భారతదేశంలోనే పండుతాయి. దేశవ్యాప్తంగా సుమారు 40 కోట్ల ఎకరాల భూమిని సాగుచేస్తూ 15 కోట్ల కుటుంబాలు (జనాభాలో సుమారు 63శాతం మంది) వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జీవనదులకు నిలయమైన మన దేశంలో 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉంటే, అందులో 29 వేల టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకుంటున్నాం. మిగతా నీరంతా సముద్రం పాలవుతున్నది. ఇంతగా జలవనరులున్నా ఇంకా మెజారిటీ రైతులు రుతుపవనాలపైనే ఆధారపడటం విషాదం. 1950లో భారత దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 59 శాతం ఉంటే.. 2019 నాటికి అది 14 శాతానికి పడిపోయింది! ఇది వ్యవసాయ రంగం పట్ల పాలకుల చిత్తశుద్ధి లేమికి నిదర్శనం.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్న రైతాంగానికి అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ రైతాంగాన్ని, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టి వేస్తున్నది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఒక నమ్మకమైన నాయకత్వం కోసం దేశ రైతాంగం ఎదురుచూస్తున్న తరుణంలో కేసీఆర్ నాయకత్వంలో దేశ వ్యాప్త ఉద్యమానికి సమాయత్తం అవటం హర్షణీయం. కేసీఆర్ నమ్మిన సిద్ధాంతం కోసం బరిగీసి నిలిచే వ్యక్తి. అలాంటి దీక్షా దక్షతలతోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. కేసీఆర్ అటు ఉద్యమ పంథా, ఇటు పార్లమెంటరీ పంథాను ఏక కాలంలో నేర్పుతో, ఓర్పుతో కొనసాగించటం వల్లే రాష్ట్ర సాధన సాధ్యమైంది. ఆ తర్వాత కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా రైతు సంక్షేమ పథకాలు విశిష్టమైనవి. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ లాంటి వాటితో వ్యవసాయ రంగంలో నెలకొన్న మౌలిక సమస్యలను పరిష్కరించారు. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన తీరు దేశవ్యాప్తంగా రైతులోకానికి ఆదర్శంగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే.. రైతు ఉద్యమానికి సారథ్యం వహించాలని దేశ నలుమూలల నుంచి వచ్చిన రైతు ప్రతినిధులు కేసీఆర్ను కోరారు.
రాజకీయ పార్టీలు రైతులను ఓట్ల రూపంలో మాత్రమే చూస్తున్నాయి. ఇప్పటికీ రైతుల సమస్యలను పట్టించుకొనే దేశవ్యాప్త రైతు సంస్థ, సంఘం అనేది లేదు. ఉత్తరాది రైతు నాయకుడు, మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్, దేవీలాల్ వంటి వారు కొంతకాలం రైతు ఉద్యమాలకు కేంద్రంగా ఉండినారు. ఆ తర్వాత కాలంలో భారత రైతాంగానికి సమర్థవంతమైన, నమ్మకమైన నాయకత్వం లేకుండా పోయింది. దేశ రైతాంగం ఒక గొప్ప నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న సమయంలో తెలంగాణ వేదికగా రైతాంగ, వ్యవసాయ పోరాటం దిశగా అడుగులు పడటం సంతోషకరం.
వ్యవసాయ శాస్త్రవేత్తలు,ఆర్థికవేత్తలు, వివిధ రంగాల మేధావులతో సమావేశమై, లోతైన చర్చలు జరిపి దేశాన్ని వ్యవసాయ సంక్షోభం నుంచి కాపాడుకునేందుకు అనుసరించాల్సిన విధివిధానాలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈ నేపథ్యంలోనే ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రైతు ప్రతినిధుల సమావేశం జరిగింది. ఒకే దేశం-ఒకే రైతు సంఘం నినాదంతో అన్ని రాష్ర్టాల రైతులు ముందుకు సాగితేనే సమస్యలు సంపూర్ణంగా పరిష్కారమవుతాయని ఈ సమావేశం భావించింది. ఈ పోరాటం కార్యరూపం దాల్చి, వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకుపోవటానికి ప్రతి ఒక్కరూ నడుంకట్టాలి. దేశవ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో రైతు జేఏసీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్త ఉద్యమానికి సమాయత్తమవుదాం. రైతుల ఐక్యతను చాటుదాం. భారతీయ రైతులు తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బతికే వ్యవసాయ భారతం ఆవిష్కారం కోసం అందరమూ ఉద్యమిద్దాం.
కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన తీరు దేశ వ్యాప్తంగా రైతులోకానికి ఆదర్శంగా నిలిచింది. ఈ నేపథ్యంలోంచే.. రైతాంగ ఉద్యమానికి సారథ్యం వహించాలని దేశం నలుమూలల నుంచి వచ్చిన రైతు ప్రతినిధులు కేసీఆర్ను కోరారు.
– పులి రాజు
99083 83567
(వ్యాసకర్త: సామాజిక కార్యకర్త)