హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గడ్డపై పుట్టి, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్రస్థానానికి ఎదిగి, తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటిచెప్పిన గొప్ప నటుడు, కరీంనగర్బిడ్డ.. దాదాసాహెబ్ ఫాలే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. పైడి జైరాజ్ 113వ జయంతి (సెప్టెంబర్ 28) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు ఘననివాళి అర్పించారు. జాతీయ చలన చిత్ర పరిశ్రమకు పైడి జైరాజ్ అందించిన సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. భారతీయ సినిమా తొలిదశలో ప్రారంభమైన మూకీల నుంచి టాకీల వరకు సాగిన పైడి ప్రస్థానం గొప్పదన్నారు.
భారతీయ వెండి తెరపై మొట్టమొదటి ‘యాక్షన్ హీరో’ పైడి జైరాజ్ కావడం తెలంగాణకు గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ ఇంకా వేళ్లూనుకోని ప్రారంభదశ నాటికే, బాలీవుడ్లో పైడి జైరాజ్ అగ్రహీరోగా రాణించడం గొప్పవిషయమన్నారు. తనదైన నటనాకౌశలంతోపాటు, దర్శకునిగా, నిర్మాతగా రాణించి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాలే అవార్డును అందుకున్న తొలితరం తెలంగాణ సినిమా నటుడు పైడి జైరాజ్ తెలంగాణ సినిమా రంగానికి మూలపురుషుడని సీఎం కొనియాడారు.
బహుభాషానటుడు
హిందీలో మాత్రమే కాకుండా మరాఠీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ, మలయాళం సహా పలు జాతీయభాషల్లో దాదాపు 300 చిత్రాలకు పైగా నటించి భారతీయ సినిమా పరిశ్రమలో శిఖర సమానుడిగా నిలిచారని సీఎం అన్నారు. తెలంగాణ నేలనుంచి దేశం గర్వించదగ్గ స్థాయిలోకి ఎదిగిన గొప్పవారిలో పైడి ఒకరని సీఎం కేసీఆర్ అన్నారు.
ఆయన అందించిన సేవలకు గుర్తుగా, రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతిలోని సమావేశమందిరానికి ‘పైడి జై రాజ్ ప్రివ్యూ థియేటర్’గా పేరు పెట్టుకుని గౌరవించుకున్నామని సీఎం గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వ కృషితో తెలంగాణ యాస, భాషా, సంస్కృతులకు సినీ పరిశ్రమలో ప్రాముఖ్యత, సాహితీ గౌరవం పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సాంస్కృతిక శాఖ ద్వారా, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ యువత సినిమా పరిశ్రమలో పలు విభాగాల్లో గొప్పగా రాణిస్తున్నదని సీఎం తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ సినిమారంగం మరింతగా రాణించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.