రంగారెడ్డి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అప్పుడే ఈ దేశం, తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని సీఎం స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే మోదీకి చేతకాదు కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉల్టా పల్టా మాట్లాడుతారు. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు నీళ్లు రావాలి. 100 దరఖాస్తులు ఇస్తే ఉలుకుపలుకు లేదు. సుప్రీంకోర్టులో కేసు విత్ డ్రా చేసుకుంటే నీళ్లు ఇస్తామని, ట్రిబ్యునల్కు సిఫారసు చేస్తామన్నారు కానీ స్పందన లేదు. ఏడాది అయిపోయిందని కేసీఆర్ గుర్తు చేశారు.
ఈ ప్రభుత్వాన్ని కేంద్రం నుంచి సాగనంపితేనే మనం అన్ని రకాలుగా బాగుపడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కూడా తెలంగాణ ఉద్విగ్నమైన పాత్రను పోషించాలి. జాతీయ రాజకీయాల్లో పిడికిలి ఎత్తాలి. మన రాష్ట్రం కూడా బంగారు తెలంగాణగా తయారవుతుంది. జాతీయ రాజకీయాల్లో ఉజ్వలమైన పాత్ర నిర్వహించి మతపిచ్చిగాళ్లను, రక్త పిశాచులను, అప్రజాస్వామిక పద్ధుతల్లో విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టే వారికి కచ్చితంగా ఈ దేశంలో స్థానం లేదని నిరూపించేటటువంటి మహాయజ్ఞంలో తెలంగాణ భాగస్వామ్యం కావాలి. మీ అందరి అనుమతితో ఆ పనికి నేను జెండా ఎత్తుతాను అని మనవి చేస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.