ఉమ్మడి రాష్ట్రంలో ఎవుసమంటేనే పెద్ద యాతన. నీళ్లు లేక, కరంట్ రాక సాగు ప్రశ్నార్ధకంగా ఉండేది. ఎక్కడ పట్టినా కల్తీ విత్తనాలు, ఎరువుల కోసం లాఠీ దెబ్బలు, నీటి వాటాలో అన్యాయాలు.. అన్నదాతను కుదేలు చేసేవి. ఉద్యమ నేతగా రైతు కష్టాలను కండ్లారా చూసిన సీఎం కేసీఆర్ కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. రైతు బంధు, రైతు బీమాతో ఆసరా అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి బీడుభూములను సస్యశ్యామలం చేశారు. కృష్ణా జలాల్లోనూ నిక్కచ్చి వాటాను ఆయకట్టుకు అందిస్తున్నారు. కేంద్రం కొర్రీలు పెట్టినా యాసంగి ధాన్యం కొనుగోలు చేసి అన్నదాతకు అండగా నిలిచారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలనే బీజేపీ కుట్రను బలంగా తిప్పికొడుతున్నారు. ఇవన్నీ గమనిస్తున్న రైతులు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. రైతు కష్టాలు తెలిసిన కేసీఆర్తో వ్యవసాయం పండుగ అవుతుందని, రైతు రాజు అవుతాడని ధీమాగా చెప్తున్నారు.
సూర్యాపేట, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : దేశానికి అన్నం పెట్టే రైతన్నను కడుపులో పెట్టుకొని చూసే నేత, రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో దాదాపు 70శాతం ఎడారిలా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గోదావరి, కృష్ణా, మూసీ జలాలు గలగలా పారుతుండడంతో నేడు 90 శాతానికి పైగా భూములు సాగులోకి వచ్చాయి. గతంలో విద్యుత్ సరఫరా, ఎరువులు, విత్తనాల కోసం రైతన్నలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడా ఇబ్బందులు లేవు. సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తుండడంతోపాటు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు సాగు దశనే మార్చేశాయి. దీంతో రాష్ట్రం పచ్చని పంటలతో సస్యశ్యామలమైంది. ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయకున్నా.. సీఎం కేసీఆర్ ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర అందించారు. దీంతో రైతులు అప్పులు తీసుకునే స్థాయి నుంచి అప్పులిచ్చే స్థాయికి ఎదిగారు. మొత్తం మీద దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమున్నదని ఉమ్మడి జిల్లా అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన సాగు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 35,09,168 ఎకరాల భూమి ఉండగా.. 2014-15 వరకు 13,12,183 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యేది. స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంతో గోదావరి జలాలు యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు వచ్చాయి. నాగార్జునసాగర్ ఆయకట్టులో లిఫ్టుల ఆధునీకరణ, కొత్త లిఫ్టుల ఏర్పాటు, డిండి ప్రాజెక్టు, మూసీ నది ఆధునీకరణతో 8,46,788ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాయి. గతంలో పడావుబడిన 8.46 లక్షల ఎకరాల్లో ఇప్పుడు వరి సాగవుతుండగా.. రాష్ర్టాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దే. తెలంగాణ లాగే దేశాన్ని కూడా అన్నపూర్ణగా మార్చగల సత్తా సీఎం కేసీఆర్కు మాత్రమే ఉన్నదని, ఆయన నాయకత్వంలోనే దేశం పురోగతి సాధిస్తుందని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరకొరగా అమలు చేస్తున్నదని పేర్కొంటున్నారు. దేశ రైతులంతా సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్న ప్రస్తుత తరుణంలో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తెలంగాణ రైతు సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
సీఎం పండుగలా
పోరాడి రాష్ట్రం సాధించిన సీఎం కేసీఆర్కు రైతు సమస్యలపై పూర్తిగా అవగాహన ఉంది. స్వరాష్ట్రంలో రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలు తీసుకొచ్చారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీయడంతో భూగర్భజలాలు బాగా పెరిగాయి. దీంతో ఒకప్పుడు దండుగ అన్న వ్యవసాయం రాష్ట్రంలో ఇప్పుడు పండుగలా మారింది. దేశంలో వ్యవసాయ రంగం బాగుపడాలంటే సీఎం కేసీఆర్ వంటి నేత జాతీయ రాజకీయాల్లో ఉండాలి. ఇక్కడ అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. సీఎం కేసీఆర్ దేశంలో క్రియాశీలకంగా ఉంటే అన్ని రాష్ట్రాల రైతులందరికీ మన లాంటి పథకాలు అందుతాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చర్యలతో సామాన్యులు సరిపడా తిండి కూడా తినే పరిస్థితి లేదు. వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ రేట్లు రెట్టింపు స్థాయిలో పెరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ వంటి నేతలు దేశ రాజకీయాల్లో కీలకం కావాలని కోరుకుంటున్నాం.
– మునగ మల్లయ్య, రైతు, కొత్తపేట (కేతేపల్లి)
సీఎం కేసీఆర్ సేవలు దేశ రాజకీయాలకు అవసరం..
రైతులకు ఎంతగానో మంచి చేస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలకు పోతే అంతా మంచి జరుగుతది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుంటే.. కేంద్ర సర్కార్ మోటర్లకు మీటర్లు పెట్టాలనడం అన్యాయం. కేసీఆర్ సార్ కంచంలో అన్నం పెడితే బీజీపీ లాక్కుంటుంది. రైతులను చిన్నచూపు చూస్తున్న కేంద్రానికి తగిన బుద్ధి చెప్పాలి. సీఎం కేసీఆర్ అందిస్తున్న రైతుబీమా, రైతుబంధుతో మాలాంటి రైతుల జీవితాల్లో సంతోషం నెలకొంది. రైతుల కష్టసుఖాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ సార్ ఒక్కరే. అందుకే ఆయన సేవలు దేశానికి ఎంతో అవసరం.
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి పోతే రైతాంగానికి మేలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశ వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి మేలు జరుగుతుంది. మా లాంటి పేద రైతులకు లాభం చేకూరుతది. గతంలో వ్యవసాయం చేయాలంటే చాలా అప్పులయ్యేవి. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగలా చేశారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న సమయంలో గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేసిన కేసీఆర్ మా పాలిట దేవుడయ్యాడు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చిన ఘనత ఆయనదే. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రైతు పక్షపాతిగా నిలిచాడు. ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటల పూడికతీత చేపట్టారు. అటువంటి నేత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే రైతులకు మంచి జరుగుతది. పంజాబ్లో జరిగిన రైతు ఉద్యమానికి మద్దతు పలికిన కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని రాష్ట్ర, దేశ ప్రజలు కోరుకుంటున్నారు.
– కమ్మంపాటి వెంకన్న, రైతు, కల్మెర (కట్టంగూర్)
దేశానికి కేసీఆర్ నాయకత్వం కావాలి..
దేశానికి రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ నాయకత్వం కావాలి. రైతు కుటుంబంలో పుట్టి రైతుల పట్ల ఉన్న అభిమానంతో అనేక సంక్షేమ పథకాలతో వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నరు. రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.5వేలు చొప్పున సంవత్సరంలో రెండు పంటలకు అందిస్తున్నారు. అకాల మరణం చెందిన రైతుల కుటుంబాలకు రైతుబీమా ద్వారా ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. కేసీఆర్ చర్యలతో వరి సాగులో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
– ఎడవెల్లి సాలమ్మ, శ్రీరాంపురం (తిరుమలగిరి సాగర్)
రైతుబంధుతో కష్టాలు తీరినయ్..
గతంలో వ్యవసాయం చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాం. అప్పులు తెచ్చి వడ్డీలు తీర్చలేకపోయేది. ఆ బాధలు పడలేక ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ బాధ పోయింది. రైతుబంధు, రైతుబీమా తెచ్చి మా కష్టాలు తీర్చిండు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిండు. ఇప్పుడు ఉన్న ఊరిలోనే పంటలు పండించుకుంటూ గౌరవంగా బతుకుతున్నం. రైతుల కోసం ఎంతగానో ఆలోచించే నేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. ఆయన వస్తే దేశవ్యాప్తంగా అనేక పథకాలు తెస్తడు. దీంతో అన్ని రాష్ర్టాల రైతులకు కొండంత భరోసా వస్తది. తెలంగాణ మాదిరిగానే ఇతర రాష్ర్టాల రైతులకు కూడా లాభం జరుగుతది.
– నీల శేఖర్, రైతు, జైకేసారం (చౌటుప్పల్ రూరల్)
సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు
ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల కష్టాల గురించి బాగా తెలుసు. వ్యవసాయంపై పూర్తిగా అవగాహన ఉంది. అందుకోసమే రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టిండు. పంటలు సాగు చేసుకునే సమయానికి పెట్టుబడి సాయం అందుతున్నది. ఏటా రెండు పంటలకు పెట్టుబడి సాయం అందిస్తుండడంతో మా లాంటి రైతులకు చాలా మేలు కలుగుతుంది. వీటితోపాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం గొప్ప విషయం. దీని వల్ల బీడు భూములన్నీ సాగవుతున్నాయి. రైతులకు తిరిగి వ్యవసాయం చేసుకోవాలనే ఆశ వచ్చింది. గ్రామాల్లో రైతు వేదికలు కూడా కట్టించి వ్యవసాయానికి సంబంధించి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఈ పథకాలన్నీ తెలంగాణ మాదిరిగా దేశ వ్యాప్తంగా అమలైతే అన్ని రాష్ర్టాల రైతులకు కొండంత భరోసా వస్తది. అది సీఎం కేసీఆర్తోనే సాధ్యం.
– యడవల్లి స్వామి, రైతు, వంగపల్లి (యాదగిరిగుట్ట రూరల్)
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24గంటల విద్యుత్ అందిస్తూ అన్నదాతలకు అండగా ఉంటున్నారు. తెలంగాణలోని రైతులలెక్క దేశమంతా ఆనందంగా ఉండాలంటే, రైతు రాజ్యం రావాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, రైతుల కష్టసుఖాలు తెలిసిన నిజమైన రైతు కేసీఆర్. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రతి గ్రామంలో కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర అందిస్తున్న ఘనత కేసీఆర్కే దక్కింది. ప్రాజెక్టులు నిర్మించి ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తుండడంతో నేడు రాష్ట్రమంతా పచ్చని పొలాలతో కళకళాడుతున్నది. తెలంగాణ లెక్కనే దేశమంతా పాడి పంటలు, పచ్చదనంతో ఉండాలంటే కేసీఆర్ వంటి దమ్మున్న నాయకుడు దేశానికి ఎంతో అవసరం.
– పిన్నింటి మోహన్రెడ్డి, రైతు, ఆత్మకూరు(ఎం)
రైతులకు పెద్ద దిక్కుగా సీఎం కేసీఆర్..
రాష్ట్రంలోని రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. అన్నదాతలకు చేయూతనందించేందుకు రైతుబంధు పథకం ద్వారా రెండు పంటలకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. రైతు కుటుంబాల శ్రేయస్సు కోసం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇటువంటి నేత అవసరం దేశంలోని రైతాంగానికి ఎంతైనా ఉంది. కాబట్టి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. దేశానికి వెన్నెముక అయిన రైతులకు అండగా నిలిచే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే అన్ని రాష్ట్రాల రైతాంగానికి మరింత మేలు చేకూరుతుంది.
– పంగ పెద్దయ్య, గుమ్మడవెల్లి గ్రామం (కొండమల్లేపల్లి)