ప్రపంచంలో సివిల్ ఏవియేషన్ విస్తృతంగా పెరుగుతోందని, తెలంగాణలో కూడా వేగం పుంజుకున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దేశంలోనే నాలుగో అతిపెద్ద ఎయిర్పోర్ట్గా నిలిచిందని చెప్పారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాతి స్థానంలో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిలిచిందన్నారు.
భూభాగం దృష్ట్యా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఢిల్లీకంటే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పెద్దదని వెల్లడించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ 5000 ఎకరాల్లో ఉంటే, మన హైదరాబాద్ ఎయిర్పోర్టు 5,200 ఎకరాల్లో విస్తరించి ఉందని వివరించారు. శంషాబాద్లో రెండో రన్వే ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని జీఎంఆర్కు చెప్పామన్నారు. టెర్మినల్కు ఉత్తరాన ఇంకో రన్వే వస్తుందని తెలిపారు. అతిత్వరలోనే రెండో రన్వే పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. దేశంలోనే నాలుగో అతిపెద్ద ఎయిర్పోర్ట్గా నిలిచినందుకు సివిల్ ఏవియేషన్లో మరింత ముందుకు పోవాలని నిర్ణయించామని తెలిపారు. ఇందులో భాగంగానే సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం కేసీఆర్ తెలిపారు.