హైదరాబాద్ : కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మరో చారిత్రాత్మక ఘట్టాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాల్వకు గోదావరి జలాలను ఆయన విడుదల చేశారు.
మంగళవారం ప్రత్యేక బస్సులో, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడ కాళేశ్వర జలాలకు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ జలాలు సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్కు చేరుకుంటాయి.
ఆ తర్వాత, మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చేరుకున్న సీఎం ప్రత్యేక పూజలు చేసి, కాళేశ్వర జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేశారు.
ఈ జలాలతో పరిసర ప్రాంతాల్లోని పాములపర్తి చెరువు, పాతురు చెరువు, చేబర్తి చెరువు, ప్రజ్ఞాపుర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా తదితర 20 చెరువులను నింపనున్నారు.
తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చాలన్న లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ కార్యాచరణ నేడు కీలక మైలురాయిని అధిగమించింది.
ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు.. అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్కు చేరాయి. ఇవాళ కొండపోచమ్మ సాగర్ నుంచి జలాలను సీఎం కేసీఆర్ హల్దీ వాగులోకి వదిలారు.
ఈ నీరు మంజీరా నది ద్వారా నిజాంసాగర్కు చేరనుంది. కొండపొచమ్మసాగర్ జలాలను గజ్వేల్ కాల్వ ద్వారా సిద్దిపేట జిల్లాలోని 20 చెరువులను నింపనున్నారు.
కార్యక్రమాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు, జోగినపల్లి సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, గంగాధర్ గౌడ్, ఫరీదుద్దీన్, ఫరూక్ హుస్సేన్, రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, హన్మంత్ షిండే, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సీహెచ్ మదన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు, సీఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్ రావు, కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వీ సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, సంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, సిద్దిపేట జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మెదక్ జడ్పీ చైర్ పర్సన్ హేమలతా శేఖర్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ, ఎలక్షన్ రెడ్డి, జడ్పీటీసీ బాలూ యాదవ్, అవుసులపల్లి సర్పంచ్ జీ కరుణాకర్, ఎంపీటీసీ రాధ ప్రవీణ్, మర్కూక్ మండలం పాములపర్తి గ్రామ సర్పంచ్ తిరుమల రెడ్డి, ఎంపీపీ పాండు గౌడ్, జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, పీఏసీఎస్ చైర్మన్ బట్టు అంజిరెడ్డి తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలు విడుదల చేసిన సీఎం కేసీఆర్ ఫొటోలు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి