హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు. ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వగ్రామం సైఫయీలో ములాయం పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ములాయం అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్తోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొననున్నారు.
ములాయం అంత్యక్రియలు ముగిసిన అనంతరం ఇవాళ సాయంత్రం కేసీఆర్ ఢిల్లీకి చేరుకుంటారు. మూడు, నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుతూ తీర్మానం చేసిన తర్వాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ నాయకులతో కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉంది.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ (82) కన్నుమూసిన విషయం తెలిసిందే. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజులుగా ఆయనను ఐసీయూలో ఉంచి, చికిత్స అందించారు. ములాయం మరణవార్తను ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ములాయం మూడుసార్లు పని చేశారు. అలాగే కేంద్రంలో రక్షణ మంత్రిగానూ సేవలందించారు.