హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో పురుడు పోసుకుని.. తెలంగాణ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలతో పాటు మరుగున పడ్డ ఎంతో మంది మేధావులు, కవుల జీవితగాథలను ప్రపంచానికి చాటి చెప్పిన, చెబుతున్న నమస్తే తెలంగాణ దినపత్రికపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాజకీయ జీవితాన్ని, ప్రజ్ఞాపాఠవాలను ప్రపంచానికి చాటిచెప్పడంలో నమస్తే తెలంగాణ విశేష కృషి చేసిందని సీఎం కేసీఆర్ ప్రశంసించారు.
పీవీ శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా పీవీ జ్ఞాన భూమిలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. పీవీ శత జయంతి ఉత్సవాల ప్రారంభ సభలో.. పీవీ మన తెలంగాణ ఠీవీ అని చెప్పాను. కేసీఆర్ ఈ మాట అంటుండు.. ఏనాటికైనా జర్నలిస్టు మిత్రులు, పత్రికా రంగ మిత్రులు.. మీరు కూడా అది ప్రదర్శించాలని చెబితే.. నమస్తే తెలంగాణ దినపత్రిక విశేషమైన కృషి చేసింది. ఎవరూ కృషి చేసిన వారు ప్రశంసలకు పాత్రులు. పీవీ ప్రజ్ఞను అనేక రకాలుగా.. ఎంత గొప్పటి ప్రతిభాశాలి, ఎంత గొప్ప ప్రతిభావంతుడు మన తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ అని ప్రపంచానికి చాటిచెప్పడంలో ఆ పత్రిక వారు కృషి చేశారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరికీ తెలియదు. బహుముఖంగా, కొత్తతరానికి, సమకాలీన సమాజానికి తెలియాలంటే ఎవరో ఒకరు నడుం కట్టాలి. ఆ పని చేసిన నమస్తే తెలంగాణ వారు, నిరంతర ధారవాహికంగా పీవీ ప్రజ్ఞాపాఠవాలకు సంబంధించి, రాజకీయ చతురత, సంస్కరణలకు సంబంధించి అనేక వ్యాసాలు వారు వెలుగులోకి తెచ్చారు. ఆ మొత్తం వ్యాసాల సంకలనాన్ని పుస్తక రూపంలో తెచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.