హైదరాబాద్ : నగరంలోని గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి 16 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘గాంధీ ఆసుపత్రిలో మహాత్ముడి విగ్రహాన్ని గొప్పగా ప్రతిష్టింపజేయడం చాలా గొప్ప విషయం. శ్రీనివాస్ యాదవ్, ఆయన మిత్రులందరికీ చిరస్థాయిగా కీర్తిదక్కుతుంది. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని దడదడలాంచిన సందర్భంలో రాష్ట్రంలో రాజధాని నడిబొడ్డున అత్యంత ధైర్యంగా, బలోపేతంగా ప్రజల ప్రాణాలను కాపాడుతామని ధైర్యంగా పని చేసిన సంస్థ మన గాంధీ ఆసుపత్రి. ఇక్కడి వైద్యులు, వైద్య బృందం, ఆనాటి సూపరింటెండెంట్ నాయకత్వంలో చేసిన వైద్యులు, నర్సులు, సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది అందరూ గాంధీ ఆదర్శాన్ని, ఆయన ఇచ్చిన ధైర్యాన్ని పుణికిపుచ్చుకొని.. హాస్పిటల్కు గాంధీ గారి పేరుంది కాబట్టి.. వారి పేరు నిలబెట్టాలని.. కరోనా మహమ్మారి సమయంలో యుద్ధం చేశారు’ అని సీఎం కేసీఆర్ ప్రశంసించారు.
‘వసతులు ఉన్నా లేకున్నా.. పీపీఈ కిట్స్ ఉన్నా లేకున్నా.. చాలాధైర్యంగా పని చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు పేషెంట్లను రిజెక్ట్ చేస్తే ఇక్కడికి తీసుకువస్తే ప్రాణాలను కాపాడిన ఘనత గాంధీ ఆసుపత్రి సిబ్బందికి దక్కుతుంది. గాంధీ స్ఫూర్తిని నింపుకొని పని చేసిన వైద్యశాఖ మంత్రి హరీశ్రావు, ఆసుపత్రి సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నా. మంచి జరిగితే ఎంత ప్రశంస వస్తుందో దీన్నిబట్టి అర్థమవుతుంది. గాంధీ గారి ధ్యానమూర్తి ఓ అద్భుతమైన ఆవిష్కరణ. రాష్ట్రానికే గర్వకారణం. ధాన్యంలో ఆయన ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి, ఆరోగ్యంగా, శాంతితో, సౌభ్రాతృత్వంతో అద్భుతంగా పురోగమించాలని ఆ సర్వేశుడిని ప్రార్థిస్తున్నట్లుగా గాంధీ విగ్రహం కనిపిస్తున్నది’ అని పేర్కొన్నారు.
‘మహాత్మా గాంధీ పుట్టిన దేశంలో పుట్టడం మనందరం చేసుకున్న పుణ్యఫలితం. మహాత్ముడు ఎంత గొప్పవాడో.. ఆయన ప్రతిపాదించిన అహింశా, శాంతి, సేవ, తాగ్యనీరతి అనే సిద్ధాంతం ఎన్నటికైనా సార్వజనీనమైన, విశ్వజనీనమైన శాశ్వతమైన సిద్ధాంతం. మహాత్ముని ప్రవచనం, సిద్ధాంతం ఏనాటికైనా విశ్వజనీనం, సార్వజనీనం, శాశ్వతం. దాన్ని ఎవరూ తుడిచివేయలేరు. గౌతమ బుద్ధుడు, ఏసుక్రీస్తుల కోవలో ప్రపంచాన్ని అహింసా సిద్ధాంతంతో ప్రభావితం చేసిన యుగపురుషుడు మహాత్మాగాంధీ. ఆయన మానవోత్తముడు, విశ్వమానవుడు. గాంధీ పుట్టి, పెరిగి, స్వాతంత్య్ర పోరాటాన్ని సవాల్గా స్వీకరించే సందర్భంలో జరుగుతున్న చరిత్ర సింహావలోకనం చేసుకుంటే తెలుస్తుంది. అంతకు ముందు కొన్ని ఘట్టాలు చేశాం’ అన్నారు.
గౌతమ బుద్ధుడి ప్రభావం, అశోకుడు యుద్ధం చేసి ఆ నెత్తుడి మడుగులను చూసి ఏవిధంగా మానసిక వ్యాకులత చెంది ఆయన కూడా ఎలా విరమించుకున్నాడో విన్నాం. వాటన్నింటికి విరుగుడుగా ప్రపంచవ్యాప్తంగా సమస్త మానవాళి ఆనాడున్నటువంటి రాచరిక వ్యవస్థల నేతృత్వంలో కత్తులు, కటార్లు, బరిసెలు పట్టుకొని కొట్టుకొని చచ్చే సందర్భంలో.. రక్తంలో ఏరులైపారే సందర్భంలో అది పనికిరాదు.. అదికాదు మార్గం అని చెప్పినటువంటి విశ్వమానవుడు మహాత్మా గాంధీ. అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కొట్టుకొని చచ్చే పరస్పరం ద్వేషించే మానవాళికి గొప్ప మానవాళికి గొప్ప మార్గాన్ని, సందేశం ఇచ్చిన గొప్ప వ్యక్తి. బ్రిటీష్ వాళ్ల వద్ద తుపాకులు, తూటాలున్నాయి.. మనం ఎదుర్కోగలమా? అంటే.. వెరీ జెంటిల్వే వికెన్ షేక్ వరల్డ్ అని సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి గొప్ప వ్యక్తి మహనీయుడు మహాత్మా గాంధీ. కరుణ, ధైర్యం ఆప్యాయత, ప్రేమ వీటన్నింటిన ద్వారా, ధైన్యాన్ని, పేదరికాన్ని, అసహాయత, నిసహాయతను ఎదుర్కోవచ్చని చెప్పిన గొప్ప మహాత్మా గాంధీ. అందుకే ఆయనను రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా అని సంబోధించారు. బాపూజీ అని తన నోరారా ఆజాద్ హింద్ ఫౌజ్ను నెలకొల్పిన సుభాష్ చంద్రబోస్ ప్రశంసించారు’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
‘మహాత్మాగాంధీ అసింహతో స్వరాజ్యం సాధిద్దామని ప్రతిపాదించారు. అదే సమయంలో, అదే కాలంలో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ను నెలకొల్పారు. ఒక సందర్భంలో విలేకరులు సుభాష్ చంద్రబోస్ను అడిగారు.. గాంధీగారు అహింస అంటున్నరు.. మీరేమో మిలటరీని స్థాపిస్తున్నారు.. మరి దీనికి మీ సమాధానం ఏంటీ బోస్గారు? అని అడిగితే.. బోస్గారు చెప్పిన గంభీరమైన మాట, చరిత్రలో శాశ్వతంగా ఉండే మాట.. నేను మహాత్మాగాంధీని బాపూజీగా, మహాత్ముడిగా భావిస్తాను. నేను కూడా వారి శిష్యుడినే, అభిమానినే, వారు చెప్పే పంథాలోనే.. అహింసా మార్గంలోనే స్వతంత్య్రం రావాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ ఆ ప్రక్రియ ఫెయిల్ అయితే.. దాని ద్వారా స్వాతంత్య్రం రాకపోతే.. సాయుధ పోరాటానికి సైన్యం తయారుచేస్తున్న తప్ప.. మహాత్మా గాంధీకి భిన్నమేమీ కాదు అని చెప్పిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్ అన్నారు’ అని సీఎం కేసీఆర్ వివరించారు.