కలెక్టరేట్ల రూపకర్త ఉషారెడ్డి ప్రతిభను ప్రశంసించిన కేసీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 12 యాదాద్రి: తెలంగాణలో అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నా, ఉమ్మడి రాష్ట్రంలో అవకాశాలు ఇవ్వకుండా అణగదొక్కారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిభావంతులకు అవకాశాలు మెరుగయ్యాయని, మన ప్రతిభ ప్రపంచానికి తెలుస్తున్నదని సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణ ఆర్కిటెక్ట్ ఉషారెడ్డి అని చెప్పారు. శనివారం భువనగిరి కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గతంలో మనకు పరిపాలన చేతకాదని ఆంధ్రవాళ్లు వెక్కిరించారని, కానీ ఇప్పుడు ప్రపంచమే మనల్ని చూసి నేర్చుకుంటున్న సన్నివేశాలు ఆవిష్కృతమవుతున్నాయని చెప్పారు. భువనగిరి కలెక్టరేట్తో పాటు 33 జిల్లాల కలెక్టరేట్ భవనాలను తెలంగాణ బిడ్డ, భువనగిరి జిల్లా బిడ్డ ఆర్కిటెక్ట్ ఉషారెడ్డి డిజైన్ చేశారని ప్రశంసించారు. తెలంగాణలో ప్రతిభావంతులు ఉన్నా గతంలో అవకాశాలు ఇవ్వలేదని, స్వరాష్ట్రంలో అవకాశాలు అందివస్తున్నాయని చెప్పారు. ప్రపంచమే మనల్ని చూసి నేర్చుకొనే స్థాయిలోఆవిష్కరణలు జరుగుతున్నాయని ఇందుకు నిలువెత్తు నిదర్శనం మన ఉషారెడ్డి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
థాంక్యూ సీఎం సర్
నేను ఒక అనామక ఆర్కిటెక్ట్ను. ఇప్పటివరకు ఏ ఫేమస్ వర్క్ లేదు. అయినా సీఎం కేసీఆర్ సార్ నాకు జిల్లా సమీకృత కార్యాయా లు నిర్మించే గొప్ప అవకాశం ఇచ్చారు. సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. శాంతికుమారి, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది ప్రోత్సాహం, సహకారంతోనే ఇదంతా చేయగలిగాను. మా నాన్న సీఎన్ రెడ్డిది చాడ గ్రామం. మా నాన్న మొదట భువనగిరి ఆర్అండ్బీలో ఏఈగా పనిచేస్తున్న సమయంలో అక్కడి క్వార్టర్స్లో పుట్టాను. నా మొదటి ఇల్లు భువనగిరి. నా భర్త, మా అమ్మ నాకు పూర్తిగా సహకారం అందించారు. నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.
–ఉషారెడ్డి, ఆర్కిటెక్ట్