రవీంద్రభారతి, సెప్టెంబరు 27(నమస్తే తెలంగాణ): ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అధికారికంగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగసంస్థల కార్యాలయాల్లో ఆయన చిత్రపటాలకు నివాళులర్పించారు. హైదరాబాద్ ట్యాంక్బండ్ జలదృశ్యం వద్ద ఏర్పాటు చేసిన 15 అడుగుల లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించి నివాళులర్పించారు.
‘ఏ జలదృశ్యంలో అయితే ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్భవించిందో, ఏ జలదృశ్యాన్నయితే అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో.. ఈ రోజు అక్కడే కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని సగౌరవంగా ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
రవీంద్రభారతిలో నిర్వహించిన జయంత్యుత్సవాల్లో మంత్రులు తలసాని, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యులు కిశోర్గౌడ్, ఉపేంద్ర, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ వెంకటరత్నంలకు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవన సాఫల్య పురస్కారాలను అందజేశారు.