హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీ, గిరిజనులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మమతానురాగాలకు, కల్మశం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీలు ప్రతీకలని సీఎం స్పష్టం చేశారు. స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. మావ నాటే మావ రాజ్.. మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. గిరిజనులకు సబ్ ప్లాన్ను పటిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
గురుకులాల ద్వారా అత్యున్నతస్థాయి విద్యను, అంబేద్కర్ విదేశీ విద్యానిధి ద్వారా విదేశీ విద్యను, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడడానికి ఆదివాసీ, గిరిజన యువతకు ఉచిత శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. గిరిజన గూడాలకు, తాండాలకు విద్యుత్తు, రోడ్లు వంటి మౌలిక వసతులను మరింతగా మెరుగుపరుస్తున్నామన్నారు. కుమ్రం భీమ్ స్మారక మ్యూజియంతో పాటు పలు మ్యూజియాలు ఇప్పటికే ప్రారంభం కాగా, రాంజీ గోండు స్మారక మ్యూజియంను త్వరలో ప్రతిష్మాత్మకంగా నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. హైదరాబాద్ లోని విలువైన ప్రాంతంలో ఆదివాసీ, గిరిజన ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామని సీఎం అన్నారు. ఆదీవాసీ సంస్కృతీ, సాంప్రదాయాలు, పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. గిరిజన సహకార సంస్థ ద్వారా ఉపాధిని అందిస్తూ, గిరి బ్రాండ్ పేరుతో అటవీ ఉత్పత్తులను విక్రయిస్తూ వారి వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వం దోహదం చేస్తున్నదన్నారు.