ఈ పట్టణం గ్రోత్ సెంటర్గా నిలువనున్నది
యాదాద్రి ప్రారంభమైతే వేగంగా అభివృద్ధి
పెరిగిన సంపదలో అందరూ భాగస్వాములే..
భువనగిరి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 12: కొత్త జిల్లాల ఏర్పాటుతో భువనగిరి పట్టణ రూపురేఖలే మారిపోతున్నాయని, బీబీనగర్, ఘట్కేసర్ మాదిరిగానే భువనగిరి కూడా హైదరాబాద్లో కలిసిపోతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. భువనగిరి జిల్లా అయితదని ఎప్పుడు, ఎవరూ కలలో కూడా ఊహించలె. భువనగిరి అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందే ప్రాంతం. బీబీనగర్, ఘట్కేసర్ మాదిరిగానే హైదరాబాద్లో కలిసినట్టుగానే ఉంటది. గతంలో అనేక కారణాల వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేకపోయింది. ఇప్పుడా ఆటంకాలన్నీ తొలగిపోయినయ్. రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఎంతో మంది మేధావులతో జిల్లాల ఏర్పాటుపై చర్చించాం. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకొన్నాం. హైదరాబాద్ టు వరంగల్కు ఇది అద్భుతమైన కారిడార్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, జనగామ జిల్లా, హనుమకొండ జిల్లా, వరంగల్ జిల్లా.. ఈ కారిడార్ అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. భువనగిరి రూపురేఖలే మారిపోనున్నాయి. బీబీనగర్, ఘట్కేసర్ మాదిరిగానే హైదరాబాద్ల భువనగిరి కలిసిపోతది. భువనగిరి గ్రోత్ సెంటర్గా నిలువనున్నది. ఇప్పటికే భువనగిరి జిల్లాలో గుట్టల వెంట భూములకు కూడా ఎకరానికి రూ.కోటి- రెండు కోట్ల ధర పలుకుతున్నది. యాదాద్రి ఆలయ ప్రాజెక్టు ప్రారంభమైతే మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది.
అందరూ హైదరాబాద్ వైపు చూస్తున్నరు
రాష్ట్రంలో పట్టణాలే కాదు.. మహబూబ్నగర్ జిల్లాలో చెంచుపెంటలు, మారుమూల ఆదివాసీ గూడేల్లో ఎకరానికి 25 లక్షలకు తక్కువ లేదు. లక్షల మాట లేదు. కోటి, రెండు కోట్లే. భూముల ధరలు యాడికెళ్లి పెరిగినయ్. ఎట్ల పెరిగినయ్? తెలంగాణ సంపద ఎట్లా పెరిగింది? నేను ఎమ్మెల్యేగా, శాసనసభా కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు సభ్యులందరితో కలిసి ఒకసారి ముంబైలో పర్యటించినం. అక్కడ మాకు ఒక వితంతు మహిళా గైడ్గా వచ్చింది. ఆమెతో మాట్లాడిన. ఎట్ల బతుకుతున్నరు? ఇల్లు ఎక్కడ? ఏంది? అని అడిగితే బాంద్రా అని చెప్పిం ది. దాని ఖరీదు ఎంతనడిగితే రూ.3.5 కోట్లని చెప్పింది. అది 1986 సంవత్సరం. అప్పుడు మన బంజారాహిల్స్లో రూ.30 లక్షలు పెడితే మంచి విల్లా దొరికేది. నేను ఆమెకు చెప్పిన బాంద్రాలో ఇల్లు అమ్ముకొని హైదరాబాద్ల తీసుకోమన్న. అందుకు ఆమె నిరాకరించింది. ఎందుకని అడిగితే మీకాడ నీళ్లు ఉండయ్. కరెంటు ఎప్పుడు ఉంటదో? ఎప్పుడు పోతదో తెలియదు అని చెప్పింది. అది అనాటి పరిస్థితి. ఇప్పుడు అందరూ హైదరాబాద్ వైపు చూస్తున్నరు. వేరే రాష్ట్రం వాళ్లు వచ్చి ఇక్కడి అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నరు. హైదరాబాద్ సిటీలో ఈ రోజు రూ.25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నరంటే కారణం ఏంటి? ఎక్కడెక్కడో ఉండేవాళ్లు కూడా మన దగ్గరకు వచ్చి కొంటాం అంటున్నరు. ఢిల్లీలో ఉండేవాళ్లు, ముంబైల ఉండేవాళ్లు కూడా హైదరాబాద్లో ఒకటి ఉండాలని కొనుక్కొంటున్నరు. వాళ్లంతా మన రాష్ట్రం వాళ్లు కాదు. అయినా ఇక్కడ కొంటున్నరు. ఎందుకు వస్తున్నరు అంటే మన దగ్గర మంచి వాతావరణం ఉన్నది.